fbpx

దేశంలో మార్పు స్పష్టం…ఇండియాదే గెలుపు : సీతారాం ఏచూరి

Share the content

దేశంలో ఇండియా వేదిక పార్టీలదే గెలుపని, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పాటవుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. గురువారం ఉదయం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు.ఉత్తర భారతదేశంలో ఇండియా వేదిక పార్టీలకు సీట్లు పెరుగుతున్నాయని తెలిపారు. ఎపిలో టిడిపి లాంటి ప్రాంతీయ పార్టీల అండతోనే బిజెపికి ఒకటీ, అరా సీట్లు వస్తాయని, నేరుగా బిజెపి గెలిచే పరిస్థితి లేదని అన్నారు. బిజెపితో కలవడం వల్ల చంద్రబాబుకు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువని అన్నారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో బిజెపికి సీట్లు తగ్గుతాయని తేలిపోయిందన్నారు.ప్రస్తుతం దేశ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.

వ్యవస్థల స్వతంత్రను దెబ్బతీస్తున్నారు.

మోదీ వికసిత భారత్‌ అంటున్నారని…కానీ ప్రజలు మాత్రం పేదరికంలో ఉన్నారని వివరించారు. ద్రవ్యోల్బణం, పేదరికం పెరుగుతున్నాయని, అదే సమయంలో ఒకశాతం వ్యాపారవేత్తల చేతుల్లో పొగుపడిన సొమ్ము 70 శాతం మంది ప్రజల ఆదాయాలతో సమానమని పేర్కొన్నారు. బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని… ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చేస్తారని తెలిపారు. ఇప్పటికే మతోన్మాద ఎజెండాతో ముందుకు వెళుతున్నారని విమర్శించారు. పార్లమెంటు, జ్యుడీషియరీ, ఎన్నికల కమిషన్‌ స్వతంత్రను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈడి, సిబిఐ రాజకీయ ఏజెన్సీలుగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనం లేకుండా చేస్తానని చెప్పిన ప్రధాని ఇప్పుడు అదానీ, అంబానీలుకు కాంగ్రెస్‌కు నల్లడబ్బు ఇస్తున్నారని చెబుతున్నారని, దేశంలో ఇంకా నల్లడబ్బు ఉందని మోడీనే ఒప్పుకున్నారని పేర్కొన్నారు. మరి అంత డబ్బు చేతులు మారుతుంటే ఈడి ఏమిచేస్తుందో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దేశంలో ఉన్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులన్నీ అదానీ, అంబానీకి ఇచ్చారు. రూ. 17 వేల కోట్ల ఆస్తి ఉన్న అదానీ మోడీ అండతో ఇప్పుడు ప్రపంచ కుబేరుడుగా మారాడని, అదే అదానీపై మోడీ విమర్శలు చేస్తున్నారని, ఇది దేనికి నిదర్శనమో అందరికీ అర్థమవుతోందని పేర్కొన్నారు.

రిజర్వేషన్లు రద్దు …వారి హక్కులను హరించడమే

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటున్నారు …మణిపూర్లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్లు మైనార్టీలు, దళితులు, గిరిజనులపై దాడులు, బుల్డోజర్‌తో కూల్చివేతలకు పాల్పడిరదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాజ్యాంగం వెనుకబడినవారికి, మైనార్టీల సంక్షేమం కోసం రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని రద్దు చేస్తామంటే వెనుకబడిన వారి హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. వారి మనుగడను ప్రశ్నార్థకం చేయడమేనని తెలిపారు. మోడీ అవినీతిని కూడా చట్టబద్ధం చేశాడనటానికి ఎన్నికలబాండ్లే నిదర్శమని తెలిపారు. నష్టాల్లో ఉన్నాయని చెప్పిన కంపెనీలు ఎక్కువ ఎన్నికల బాండ్లు కొన్నాయని అన్నివేల కోట్లు వాటికి ఎక్కడ నుండి వచ్చాయో చెప్పాలన్నారు. అదే సమయంలో కంపెనీలపై ఈడి దాడులు చేయడం, ఆ కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వందల కోట్లు ఇవ్వడం జరిగిపోయాయని, ఈ పద్ధతుల్లో మోడీ అవినీతిని చట్టబద్ధం చేశారని పేర్కొన్నారు. కుంభకోణాలు, మైనార్టీలపై దాడులూ పెరిగాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *