దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఇంటికి సాగనంపి లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరంలో స్థానిక ఆనం రోటరీ హాల్ నందు ఇండియా కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది.ఇండియా కూటమిలో బాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ “లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ” సభ జరిగింది. ఈ సభకు సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి లు తాటిపాక మధు ,టి అరుణ్ లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చలేని మోడీ..నేడు “మోడీ గ్యారెంటీనే” పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి నూతన మేనిఫెస్టో పెట్టారని మండిపడ్డారు. మోడీ ,బాబు ,పవన్ లు…మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ,రాజధాని నిర్మాణం చేస్తామని 2014 ఎడాది ఎన్నికల్లో హామీ ఇచ్చి … ఏ ఒక్కటిని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేశంలో రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు బిజెపి కట్టబెడుతుందని ధ్వజమెత్తారు. రైతులుకు రుణమాఫీ చేయమని అడిగితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతూనే కార్పొరేట్ సంస్థల వేలకోట్ల రుణాలను మాఫీ చేస్తుందని విరుచుకుపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడిన ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు అయిన సిబిఐ, ఈడి, ఐటీ లతో దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. బిజెపిని వ్యతిరేకించే ముఖ్యమంత్రులను జైల్లో నిర్బంధిస్తున్న పరిస్థితి దేశంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.