ఎన్నడూ లేనట్లుగా ఈసారి వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిమీద ఆంధ్రప్రదేశ్లో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో జతకట్టి తమకు కావలసిన కొన్ని సీట్లను సర్దుబాటు విధానం ద్వారా తీసుకుని అక్కడ పోటీ చేసే అవకాశం ఉన్న వామపక్షాలు ఇప్పుడు కనీసం ఏ పార్టీ కూడా స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో తమ దారి ఎటువైపు వెళుతుందోనని భయపడుతున్నాయి. సిపిఎం సిపిఐ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ ఏ పార్టీ కూడా ఇప్పటివరకు వారికి నిర్దిష్టమైన స్పష్టత ఇవ్వడం లేదు. దాదాపు తెలుగుదేశం పార్టీతోనే కలిసి ప్రయాణం చేస్తామని మొదటి నుంచి వామ పక్షాలు భావించాయి. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు కుదిరితే బిజెపి కూడా కచ్చితంగా అలయన్స్ లో ఉండాలని పవన్ కళ్యాణ్ పట్టుబడుతుండడంతో ఇప్పుడు వామపక్షాలకు దారి తెన్ను కనిపించడం లేదు. బిజెపి కనుక తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిలో ఉంటే వామపక్షాలు సైదాంతిక పరంగా ఆ కూటమిలో కొనసాగే అవకాశం లేదు. దీంతో వారు ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు.
ఒంటరిగా వెళ్తే?
వామపక్షాలు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాలు నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో ఉన్న అక్కడ బలమైన ఓటు బ్యాంకింగ్ క్రమంగా తగ్గినప్పటికీ కనీస ఓట్లు వారికి పడతాయి. దీంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా దీనిని అధికార వైసిపి వినియోగించుకోవాలని చూస్తోంది. వాము పక్షాలు బలంగా ఉన్నచోట కాస్త ఆర్థిక దన్నును వారికి అందించి, బలమైన ఓటు బ్యాంకు ను చీల్చే ప్రక్రియను వైసీపీ చేస్తుంది అనడంలో సందేహం లేదు. వైసిపి వ్యతిరేక ఓట్లను చీల్చితే కచ్చితంగా అది వైసిపి అనుకూలమే. ప్రభుత్వ ఓట్లు చీల్చే ప్రతి పార్టీ అవసరం ఇప్పుడు వైసీపీకి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ తెలుగుదేశం పార్టీతో జత కట్టకపోతే వామపక్షాలు ఒంటరిగా పోటీ చేసి బలమైన విపక్షాల ఓటు బ్యాంకు ను చీల్చేందుకు వైసిపి ఆర్థికంగా ఉపయోగపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ పెద్దలు వామపక్షాలు కాస్త బలంగా ఉన్నచోట రెండు మూడు వేలు ఓట్లు వచ్చే నియోజకవర్గాలను గుర్తించారు. ఒకవేళ పొత్తులో వామపక్షాలు లేకుంటే వారితో ఒంటరిగా పోటీ చేయించి భారీగా ఓటు చేర్చాలి అన్నది వైసిపి పెద్దల ఆలోచన. వచ్చే ఎన్నికల్లో పక్షాలు అడుగులు ఎటువైపు పడతాయి అన్నది త్వరలోనే తేలనుంది.