ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి విజయం కోసం పనిచేసిన ఐ ప్యాక్ టీం ప్రతినిధులకు సిఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఉన్న ఐ ప్యాక్ ఆఫీస్కు ఆయన చేరుకున్నారు. సీఎం జగన్ కు ఐ ప్యాక్ టీం సభ్యులు ఘన స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో పోలీసులు బెంజ్ సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ఐదేళ్ల వైసిపి పాలనలో మంచి పాలన అందించాం. వైసిపి అందించి సంక్షేమ పాలన గతంలో ఎవరు అందించలేదు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందర రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు. అందుకు భిన్నంగా దేశంలో అందరూ షాకయ్యేలా జూన్ 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్ ఎంతో సాయపడిందని, ఐప్యాక్ సూచనలను గత 5ఏళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు.ఐ ప్యాక్ సేవలు వేల కట్టలేనివి .2029 లో జరిగే ఎన్నికల్లో కూడా ఐ ప్యాక్ తో కలిసి పని చేస్తామని అన్నారు. అనంతరం ఏపీలో జరిగిన పోలింగ్ శాతం, విజయావకాశాలపై ఐ ప్యాక్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయి అనే దానిపై సమాచారం అడిగి తెలుసుకునేందుకు అక్కడకు చేరకున్నారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.