fbpx

చీరాల చిక్కులు వైసీపీకి తీరేవి కావు!

Share the content

చీరాలలో అధికార పార్టీలో నిన్న మొన్నటి వరకు ఉన్న వర్గ పోరు వచ్చే ఎన్నికల్లో ఎంత మీద ప్రభావం చూపుతుంది అన్నది స్థానిక కేడర్ కు అర్థం కావడం లేదు. చీరాలలో ఉన్న అన్ని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ కరణం వెంకటేష్ కు దారి సులువు చేస్తున్న వైఎస్ జగన్ దానికి అనుగుణంగా స్థానికంగా ఉన్న నేతలు కలిసికట్టుగా పని చేస్తారా లేదా అన్నది మాత్రం చిక్కుముడిగానే ఉంది. అద్దంకి నియోజకవర్గం నుంచి వలస వచ్చిన కరణం బలరాం గత ఎన్నికల్లో టిడిపి తరఫున విజయం సాధించారు. గెలిచిన తర్వాత అతి తక్కువ రోజుల్లోనే వైసీపీ గూటికి చేరిన కరణం బలరం వచ్చే ఎన్నికల్లో తన కొడుకు వెంకటేష్ కు ఇక్కడి నుంచి సీటు ఇప్పించేలా ఇప్పటికే వైయస్ జగన్ ను ఒప్పించారు. కరణం వెంకటేష్ ను చేరాల నియోజకవర్గ ఇన్చార్జిగాను ఇటీవల ప్రకటించిన జగన్ చీరాలలో ఉన్న త్రిముఖ పోటీని క్రమంగా తగ్గించగలిగారు. చీరాలలో ప్రధాన వర్గంగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన జగన్ ప్రధానమైన అడ్డంకి నీ తొలగించి ఆమంచి కృష్ణమోహన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. స్థానికంగా బలమైన కేడర్ ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పర్చూరుకు అయిష్టంగానే వెళ్ళినప్పటికీ, చీరాల పక్కనే ఉన్న పర్చూరు కావడంతో ఆయన సర్దుబాటు చేసుకోక తప్పలేదు. అయితే ఇక్కడి నుంచి బీసీ సామాజిక వర్గం పద్మశాలీలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే పోతుల సురేష్ భార్య సునీత మరో వర్గంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంసిద్ధమవుతున్న సునీతను సైతం ఎమ్మెల్సీ ఇచ్చి చల్లబరిచిన జగన్ వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోతుల సునీత వర్గం కూడా చల్లబడింది. దీంతో చీరాల నియోజకవర్గంలో పూర్తిస్థాయి రాజకీయాలు చేసేందుకు కరణం వెంకటేష్ సంసిద్ధం అవుతున్నారు.

కలిసికట్టుగా పని చేస్తారా?

సర్దుబాటు చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచేందుకు ఈ వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా పని చేస్తాయా లేదా అనేది అసలు ప్రశ్న. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్న అమంచి కృష్ణమోహన్ కరణం బలరాం కు ఎంత మేర సహకరిస్తారు అనేది చెప్పలేం. ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచిన ఆమంచికి కొనిజేటి రోశయ్య గురువుగా భావిస్తారు. కీలక సమయంలోనే స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుంచి గెలిచిన ఆమంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, బూత్ లెవెల్ స్థాయిలోనూ తన అనుచర వర్గాన్ని బలంగా పెట్టుకున్నారు. చేరాల నియోజకవర్గాన్ని మొదటి నుంచి అడుగుతున్న ఆమంచిని కాదని సీనియర్ నేత కరణం బలరాంకు జగన్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆమంచి చాలా ఇబ్బంది పడ్డారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్క నియోజకవర్గానికి వెళ్లడం అంటే అది ఆత్మహత్య సదృశ్యం గానే భావించారు. అయితే అప్పట్లో వైయస్ జగన్ మాట కాదనలేక ఆయన పర్చూరు వెళ్లక తప్పలేదు. అయితే ఆ మంచి సోదరుడు ఆమంచి స్వాములు ఇటీవల జనసేన పార్టీలో చేరడం వెనుక కూడా ఆమంచి కృష్ణమోహన్ వ్యూహం దాగి ఉంది అనేది రాజకీయ వర్గాల మాట. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి స్వాములు పోటీ చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజం అయితే స్వాములు విజయానికి ఆమంచి కృష్ణమోహన్ కచ్చితంగా సహకరిస్తారు. స్థానికంగా తన పట్టు నిలుపుకోవడానికి ఆమంచి కృష్ణమోహన్ అధికంగా ప్రాధాన్యం ఇస్తారు. దీనిలో భాగంగానే జనసేనలోకి తన సోదరుడిని పంపించి, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక పట్టును వదులుకోకుండా పని చేయాలి అని ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. అదే నిజం అయితే మళ్లీ ఆమంచి కుటుంబానికి కరణం బలరాం కుటుంబానికి మధ్య సొంత పార్టీలోనే తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. దీనిని కరణం బలరం ఎలా ఎదుర్కొంటారు అధిష్టానానికి ఎలా ఫిర్యాదు చేస్తారు అన్నది కూడా అసలు ప్రశ్న. ఒకవేళ చీరాల టికెట్ జనసేన తరఫున స్వాములకు కేటాయిస్తే ఆమంచి కృష్ణమోహన్ పూర్తిస్థాయిలో చీరాలలోనే పనిచేసే అవకాశం కూడా కనిపిస్తోంది. పర్చూరు నియోజకవర్గ టికెట్ తనకు కేటాయించిన కేటాయించకపోయిన దానిని ఆమంచి కృష్ణమోహన్ పట్టించుకునే అవకాశం కూడా లేదు. దీంతో ఇప్పుడు ఆమంచి కరణం బలరాం కుటుంబాల మధ్య మళ్లీ చీరాలలో వేడి పుంజుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *