దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకూ పూర్తయిన నాలుగు దశల్లో 66.95% పోలింగ్ నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇప్పటివరకు 45.1 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. మిగిలిన 5, 6, 7 దశల్లో పోలింగ్ శాతం పెంచేందుకు దేశం నలుమూలల్లో ఉన్న ప్రతి ఓటరునూ స్పృశించేలా మరింత ఉదృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పారిపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఓటు వేయాలని కోరుతూ మీకు ఫోన్ వస్తే ఆశ్చర్యానికి గురికావొద్దని ఓటర్లకు వారు విజ్ఞప్తి చేశారు.ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ… “భాగస్వామ్యం మరియు సహకారం అనే పునాదుల మీదే ఓటరు అవగాహన కార్యక్రమాల విజయం ఆధారపడి ఉంటుందన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి మేరకు పెద్ద ఎత్తున సంస్థలు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కేవలం ప్రజాప్రయోజనార్థం ఓటరు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను చైతన్యపరచడం అనేది ఎంతో సంతోషదాయకం అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలంతా పెద్దఎత్తున ఎన్నికల్లో పాల్గొని భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ డే అనేది కేవలం ఒక హాలిడే కాదని, మనమంతా గర్వించే రోజనీ, ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఓటర్లను చైతన్య పర్చేందుకు, వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు వివిధ మార్గాల ద్వారా పలు రకాల అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలియజేసింది. ముఖ్యంగా రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి వంటి రాజ్యాంగాధికారుల సందేశాలతో దూరదర్శన్ రూపొందించిన పలు లఘు చిత్రాలను, ఆడియో-విజువల్ డాక్యుమెంటరీలను ప్రసార భారతి ద్వారా ప్రదర్శించడం ద్వారా విస్తృత స్థాయిలో ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారాను, IPL మ్యాచ్ల సమయంలోను, ఫేస్ బుక్, యూ ట్యూబ్, గూగుల్ పే, ఇతర గూగుల్ ప్లాట్ఫారమ్ల ద్వారాను, ఓటింగ్ డే అలర్టులు, వాట్సయాప్ మెసేజస్ లు, రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి రిటైల్ నెట్వర్క్ ద్వారాను, పోస్టాఫీసులు మరియు బ్యాంకింగ్ సంస్థల యొక్క విస్తారమైన నెట్వర్క్ ల ద్వారాను, పెట్రోలియం, గ్యాస్ అవుట్లెట్ల వద్ద హోర్డింగుల ద్వారాను, రైల్వేస్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ల ద్వారా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహకారంతో విమానయాన సంస్థల్లో మరియు ఇన్ఫ్లైట్ ప్రకటన ద్వారాను, ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పాట్నా, చండీగఢ్, పూణే తదితర ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారాను ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో చిత్రాలు మరియు పాటను ప్లే చేయడం ద్వారాను, దేశంలోని మారుమూల ప్రాంతాలలో ప్రత్యేక పోలింగ్ స్టేషన్ల సెటప్పై Sansad TV షార్ట్ ఫిల్మ్ల ద్వారాను, అముల్, మదర్ డెయిరీ మరియు ఇతర పాల సహకార సంస్థలు తమ పాల పౌచ్లపై ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్’ అనే సందేశంతోనూ, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా, వార్తాపత్రికలలో ప్రత్యేకమైన సందేశాలతో, ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారాను, బైక్ యాప్ Rapido, Payments యాప్ PhonePe, BookMyShow, MakeMyTrip ‘MyVoteWalaTrip’, Zomato మరియు Swiggy వంటి ఫుడ్ డెలివరీల ద్వారాను, Tata Neu యాప్, Uber India యాప్ ద్వారాను మరియు ట్రూకాలర్ అవుట్బౌండ్ కాల్స్ సమయంలో ఓటరు అవగాహన సందేశాన్ని పంపండం ద్వారాను పలు రకాలుగా ఓటర్ల చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలియజేసింది.