తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దాదాపు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయనకు ప్రతికూల తీర్పులే వస్తున్నాయి. సోమవారం కీలకమైన తీర్పులు వస్తాయని టిడిపి క్యాడర్ భావించిన తరుణంలో ఏసీబీ కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లు మొత్తం కొట్టివేస్తే సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా మరోసారి వాయిదా పడింది. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు బయటకు రావడం ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు జైలులోకి వెళ్లి నెల రోజులు దాటిన తరుణంలో కచ్చితంగా సోమవారం చంద్రబాబుకు అనుకూలంగా కోర్టులు తీర్పులు వస్తాయని భావించారు. అయితే దానికి భిన్నంగా ఇప్పుడిప్పుడే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం లేనట్లుగా పద్మవ్యూహం బలంగా పనినట్లుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు అయిపోగానే మరో మూడు కేసులను రెడీగా పెట్టిన ప్రభుత్వం… ఏ కోర్టులోనైనా బెయిల్ వస్తే కనుక మరో కేసును బయటకు తీసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది.
వైసీపీ నాయకుడు జగన్ చెబుతున్నట్లుగా చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో తాను దేశంలో కూడా లేనని చట్టం ప్రకారమే చంద్రబాబు అరెస్టు జరిగిందని చెబుతున్నప్పటికీ మొత్తం వైసిపి అధినాయకత్వం కనుసనల్లోనే చంద్రబాబు కేసులు ఫైల్ అయ్యాయి అన్నది కాదు అనలేని నిజం. ఇదే రీతిన చంద్రబాబు ఎన్నికల వరకు జైలులోనే ఉంటే, టిడిపిని ముందుండి నడిపించేవారు ఎవరు అనేది ఇప్పుడు కీలకం కానుంది. చంద్రబాబు జైల్లో ఉండి అభ్యర్థులను ఖరారు చేసినా, ఎన్నికల వ్యూహాలు వేయకుండా మాత్రం అధికార పార్టీ బలంగా అడ్డుకోగలదు. వారంలో మూడు రోజులు మాత్రమే ములాకాతుకు అవకాశం ఉండడంతో ఆ సమయంలో మాత్రమే చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే కీలకమైన సమయంలో చంద్రబాబు ఎత్తులు జిత్తులకు చెక్ పెట్టే అవకాశం వైసీపీకి లభించినట్లే. ఇది వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పనిచేస్తుంది అనే కోణంలోనే చంద్రబాబును బయటకు రానీయకుండా జగన్ అడ్డుకున్నారు. చంద్రబాబు బయట ఉంటే కనుక ఆయన ఎత్తులను తట్టుకోవడం వైసీపీకి కష్టం. దీంతో చంద్రబాబును లోపల పెట్టడం ద్వారా మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని వైసిపి నమ్ముతోంది. తెలుగుదేశం పార్టీకి లోకేష్ బయట ఉన్నా… ఎలక్షనీరింగులో లోకేష్ కు పెద్ద అనుభవం లేదు. చంద్రబాబును ఈ ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ చేయకుండా అడ్డుకోవడం ద్వారా కచ్చితంగా గెలుపు సాధ్యమని వైసిపి నమ్ముతోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ కు కూడా ఎలక్షన్ ఎదుర్కోవడం ఇది రెండో సారి కావడంతో ఆయనకు కూడా బలమైన ఎలక్షనీరింగ్ చేయగల సత్తా లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అలజడులు సృష్టించడం అలాగే అభ్యర్థులను కొనే సాహసం కూడా వైసీపీ చేస్తుంది. దీనిని స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు కూడా చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను కొనేయడం ద్వారా లేదా భయపెట్టడం ద్వారా తమ అదుపులోకి మొత్తం ఎలక్షన్లు తీసుకోవాలని వైసిపి ప్లాన్ లా కనిపిస్తోంది. ఇప్పటికే బూతు లెవెల్ కార్యకర్తల మీద గంపెడు కేసులు పెట్టిన వైసీపీ వారిని వచ్చే ఎన్నికల్లో భూత్ ఏజంట్లుగా అంగీకరించే ప్రసక్తే కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ఎన్నికలు గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు వైసిపి మొదలుపెట్టింది. ఇవన్నీ అడ్డుకోవాలి అంటే చంద్రబాబు ఎత్తులు కచ్చితంగా అవసరం. అలాంటి బాబునే లోపల పెడితే మొత్తం ఎలక్షన్ వన్ సైడ్ గా చేసుకోవచ్చని వైసిపి బలంగా భావిస్తోంది.