బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంటే బిజెపిలోనే చాలామందికి పడదు. ఆయన ఒంటెద్దు పోకడలకు పోతారని కనీసం ఎవరిని కలుపుకొని వెళ్లరని బోలెడు ఫిర్యాదులు ఇప్పటికే అధిష్టానానికి అందాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిజెపిలో పెద్ద ఉత్సాహం కూడా కనిపించడం లేదు. అమిత్ షా వంటి నాయకులు బహిరంగ సభలు పెట్టిన జేపీ నడ్డా వంటి నేతలు రాష్ట్రానికి వచ్చిన బిజెపి వైఖరిలో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. దీనికి తగినట్లుగా రాష్ట్ర బిజెపి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
అసలు బిజెపి ప్రణాళిక ఏంటి?
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటి అన్నది ఇప్పటికే అంతుబట్టడం లేదు. పొత్తులు ఉంటాయా లేదా అన్నది స్పష్టత లేదు. జనసేన పార్టీతో పొత్తు ఉంటుంది అని చెబుతున్నారు కానీ జనసేన పార్టీతో కలిసి ప్రజా పోరాటాలు చేసింది లేదు. వైసీపీకి సహకరిస్తూనే మరోపక్క కేంద్ర పెద్దలు జగన్ తిడుతున్నారు. బిజెపి వైఖరి ఇటు జనసేన పార్టీకి అటు వైసీపీకి అంతు పట్టడం లేదు. మరోపక్క తెలుగుదేశం పార్టీ దీననంతటిని తీక్షణంగా గమనిస్తోంది తప్ప వారు కూడా బిజెపి తీరు మీద ఎక్కడ బహిరంగంగా కామెంట్ చేయడం లేదు. అధికార పార్టీ తీరు ఒకలా ఉంటే విపక్షాల తీరు మరోలా కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి బలం లేకపోయినప్పటికీ కేంద్ర పెద్దల సహకారంతో మాత్రం మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క పార్టీలోనే అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం తీర్చడం మీద దృష్టి పెట్టకుండా, పార్టీని అలా అలా నడిపిస్తోంది. బిజెపితో వెళ్లడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. బిజెపితో వెళ్లడం వల్ల కచ్చితంగా మైనారిటీల ఓట్లు కోల్పోవాల్సి వస్తుందని టిడిపి లెక్కలు వేస్తోంది. దీంతో ఇప్పుడు బిజెపి ఏం చెబుతుంది అన్నది అర్థం కానీ పరిస్థితి నెలకొంటుంది.