దళితుల ఓట్లపై బీజేపీ కన్నేసిందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో దళిత సామాజిక వర్గంలోని కీలకమైన మాదిగలను దగ్గర చేసుకునేందుకు బిజెపి పెద్దలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న ఎస్సీ వర్గీకరణకు బిజెపి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. దీంతో దళితుల్లో కీలకమైన మాదిగలను తమకు దగ్గర చేసుకోవాలని… ఈ దిశగా కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పాచిక పారుతుంది అని బిజెపి పెద్దలు ప్లాన్ చేస్తున్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కు అమిత్ షా ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆయనతో ప్రత్యేకంగా 45 నిమిషాల పాటు విడిగా మాట్లాడ్డం మరొక ఎత్తు. మంద కృష్ణ మాదిగ ఎప్పటినుంచో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల నష్టపోతున్నారని ఉద్యమం చేస్తున్నారు. ఎస్సీ వర్గాల్లో మాలలకు ఎక్కువగా లబ్ధి కలుగుతుందని మాదిగలు ఎస్సీ రిజర్వేషన్లు లబ్ధి పొందలేకపోతున్నారు అన్నది మాదిగల ఆవేదన. ఎస్సీ ఓట్లు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 20 నుంచి 25 శాతం మధ్యలో ఉంటాయి. చాలా నియోజకవర్గాల్లో ఎస్సీ లు నిర్ణయాత్మకమైన ఓటర్లుగా ఉన్నారు. ఎస్సీల్లో మాదిగలు శాతం అధికం. మాదిగలు సుమారుగా 13 నుంచి 15% మధ్యలో ఉంటారు అన్నది ఆ సామాజిక వర్గ పెద్దలు చెబుతున్న లెక్క. దీంతో ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే చాలావరకు లబ్ది కలుగుతుంది అన్నది బిజెపి పెద్దల ప్లాన్. మాదిగలకు మేలు చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు బిజెపి ఒక అనువైన సమయం కోసం ఎదురుచూస్తోంది. దీనిలో భాగంగానే అమిత్ షా తో మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బలమైన శక్తిగా ఆవిర్భవించాలని ఆరాటపడుతున్న బిజెపికి కచ్చితంగా మాదిగ సామాజిక వర్గం మద్దతు అనేది చాలా కీలకం. ప్రస్తుతం మాదిగ సామాజిక వర్గంలో అధిక శాతం వైసీపీ వైపు ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవాలి అంటే కచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ విభజన జరగాలి అని బిజెపి భావిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ కు పచ్చ జెండా ఊపడం ద్వారా కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఓవర్గం మద్దతును కూడగట్టుకోగలమని బిజెపి భావిస్తోంది.