కాకినాడ జిల్లాలో లైపెజ్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసే వ్యర్థ పదార్ధాల పైప్ లైన్ వలన మత్స్య సంపదకు నష్టం అపారా వాటిల్లుతున్నందున ఆ ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కొనపాపపేట మత్స్యకారులు నిర్వహిస్తున్న ఆందోళనకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని ప్రకటించారు. కాకినాడ జిల్లా, యూ. కొత్తపల్లి మండలం, కొనపాపపేట మత్స్యకార గ్రామస్తులు కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. మత్స్యకారులు పలు దఫాలుగా నిర్వహించిన ఆందోళనవల్ల అధికారులు రెండు సార్లు చర్చలకి పిలిచి ఏమీ తేల్చలేదని విమర్శించారు. స్థానిక వైసీపి ఎమ్మెల్యే నష్ట పరిహారం ఇప్పిస్తానని మత్స్యకారులకు వాగ్దానం చేసి, మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో మత్స్య కారులు తమ బోట్లకు తామే నిప్పు పెట్టుకుని నిరసన తెలిపారని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న చర్చలని ప్రకటించిన అధికారులు …మరోసారి వాయిదా వేసి మత్స్యకారులను పదే పదే మోసగించడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లాలో రిలయన్స్, ఓఎన్జిసి సంస్థలు వేసిన పైప్ లైన్ల వల్ల మత్స్య కారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డెక్కన్ కంపెనీ వదిలే వ్యర్ధాలు వల్ల చేపలు వాసన వచ్చి ధరలు రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. కాబట్టి మత్స్య కారులు డిమాండ్ చేస్తున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, పొల్యూషన్ బోర్డు అధికారులు, మత్స్య శాఖ అధికారులు, లైపెజ్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యర్ధాలు నేరుగా సముద్రంలోకి వదల కుండా పైపు లైన్ పనులు నిలిపి వేయాలని అన్నారు.