ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో లక్ష మందికి పైగా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామ,వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని,సచివాలయ ఉద్యోగులకు ఆలస్యంగా ప్రొబేషన్ డిక్లేర్ చేసినందున, ఆ సమయంలో రావలసిన బకాయిలు త్వరితగతిన ఇవ్వాలని డిమాండ్ చేశారు.వ్యవస్థ ప్రారంభించి నాలుగు సంవత్సరాల అయినప్పటికీ స్పష్టమైన పదోన్నతి ఛానల్ ఇప్పటివరకు ప్రకటించలేదు తక్షణమే పదోన్నతి చానల్ ప్రకటించి అర్హులైన సచివాలయ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు. ఒక శాఖకు సంబంధించిన సచివాలయ ఉద్యోగి పై, ఆ ఒక్క శాఖ అధికారుల ఆజమాయిషి మాత్రమే ఉండేలా ( సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ) చర్యలు చేపట్టి, జాబ్ చాట్ మేర రావలసిన అధికారాలు అన్ని కల్పించాలని తెలిపారు.సచివాలయ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని పేర్కొన్నారు.
సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ రద్దు చేయాలని, ఇన్చార్జి విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు ఫుల్ అడిషనల్ చార్జ్ ఇచ్చి, అదనపు వేతనాలు చెల్లించాలని తెలిపారు.వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఉద్యోగులకు తక్షణమే బదిలీలు చేపట్టాలని పేర్కొన్నారు. సుమారు 15 నెలలుగా సచివాలయ ఉద్యోగుల జీతాల నుంచి ఏపీజిఎల్ఐ సబ్స్క్రిప్షన్ కడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏపీజీఎల్ఐ బాండ్లు రాలేదు, తక్షణమే సచివాలయ ఉద్యోగులందరికీ బాండ్లు అందేలా ప్రభుత్వం చొరవ చూపాలని తెలిపారు.ఇప్పటికే అనేక పనులతో తీవ్ర ఒత్తిడి గురవుతున్న సచివాలయ ఉద్యోగులకు బిఎల్ఓ డ్యూటీ ల నుంచి పూర్తిగా మినహాయించాలని కోరారు.
వీటన్నిటిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.