గత ఎన్నికల వేళ “ప్రజా సంకల్ప యాత్ర” పేరుతో పాదయాత్ర చేస్తూ అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే వేతనం కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని గొప్పలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాకా జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్ విమర్శించారు. కాకినాడ ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె కు శుక్రవారం నాడు సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా సిఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.అంగన్వాడీలు అడిగినా హామీలు అన్ని న్యాయపరమైన హామీలని వాటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. అంగన్వాడీలతో చర్చలుకు పిలిచి ఉద్యోగాలు తొలగిస్తాముని బెదిరింపులు పాల్పడడం వైసీపీ పార్టీ అహంకారంకీ నిదర్శనమని ఎద్దేవా చేశారు. అంగన్వాడీలకు ఉన్న రూ 7,000 రూపాయల వేతనాన్ని రూ 10,500 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వివరించారు .వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగ్ననర ఎండ్లు పూర్తి అయినా అంగన్వాడీలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. మరో మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వస్తుందని,వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.