గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బైబిల్ మిషన్ ప్రాంగణం వద్ద ఈ నెల 14 న జరగనున్న ” అధికజన మహాసంకల్ప” సభను జయప్రదం చేయాలని డాక్టర్ పివివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఐఏఎస్ ను వదిలి ప్రజల్లోకి విజయ్ కుమార్ వచ్చారన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, ఓసి వర్గాలలోని పేదలు తరతరాలుగా పేదరికం అనుభవిస్తూ అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం ఎనిమిది దశాబ్దాలుగా ఆధిపత్య పెత్తందారీ వర్గాల పాలనలో కూటికోసం, గుడ్డ కోసం, గూడు కోసం అలమటిస్తూ బ్రతుకుతున్నారన్నారు. వారి జీవితాల మార్చాలనే ఉద్దేశంతో గుంటూరు లో జరిగే విజయ్ కుమార్ సభకు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యత విజయపథం యాత్ర జూలై 23 2023 తడలో ప్రారంభమై 142 రోజులుగా 2,729 కిలోమీటర్లు తో 2024 ఫిబ్రవరి 2తేదీన తుని వరకు జరిగింది అని తెలిపారు.పాదయాత్ర 12 జిల్లాలలో 1250 గ్రామ, పట్టణ, నగర ప్రాంతాలలో లక్షలాదిమంది ప్రజలతో మమేకమై వారి దీనగాధలను ప్రత్యక్షంగా చూశారు అని పేర్కొన్నారు. రెండో విడత పాదయాత్రకు ముందు జరిగే అధిక జన మహాసంకల్పయాత్ర సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీ లు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.