ఏలూరులో మొదలైన వాలంటీర్ల వ్యవస్థ తుఫాను ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను చుట్టుముట్టేస్తోంది. వారాహి విజయ యాత్రలో ఏలూరులో రెండో దశ షెడ్యూల్ మొదలుకాగానే పవన్ కళ్యాణ్ మొదటి సభలోనే వాలంటీర్ల అంశాన్ని లేవనెత్తారు. తర్వాత జరిగిన తాడేపల్లిగూడెం తణుకు సభలోను దీనిమీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తూ పోయారు. ప్రభుత్వం మీద పదునైన విమర్శలు చేయడంతో పాటు వాలంటీర్ల ద్వారా జరుగుతున్న అసలు విషయాన్ని వెనుక ఉన్న విషయాలను ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజల దగ్గర నుంచి కీలకమైన వ్యక్తిగత సమాచారం ఎక్కడికి వెళుతుంది ఏం చేస్తున్నారు అన్న కీలకమైన ప్రశ్నలను ప్రజల్లో తీసుకువచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. ఈ విషయం మీద రోజు రోజుకి ప్రజల్లో చైతన్యం ఎక్కువ కావడం వాలంటీర్లను క్షేత్రస్థాయిలో అనుమానంగా చూడడం వంటి విషయాలను ఇంటిలిజెంట్ ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంది. పవన్ కళ్యాణ్ 9వ తేదీన ఏలూరు సభలో వాలంటీర్ల అంశం మీద మాట్లాడితే తాపీగా ఇప్పుడు ఆయన మీద పరువు నష్టం కేసు వేయడానికి నోటీసులు ఇచ్చింది. వాలంటీర్ల అంశం మీద మొదట్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వైసీపీ భావించింది. అయితే దానికి భిన్నమైన అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం కావడంతో పాటు ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం దీనికి ప్రతిగా పవన్ కళ్యాణ్ మీద న్యాయపరమైన యుద్ధం చేయాలని భావిస్తోంది. దీంతో ఇప్పుడు ఇప్పుడే వాలంటీర్ల అంశం అనేది రాజకీయ వేడికి ప్రత్యేక కారణం అవుతోంది.
ప్రజలు నమ్మితే పవన్ విన్ అవుతారు నమ్మకపోతే లాస్ అవుతారు
వాలంటీర్ల అంశం విషయంలో ప్రజల నమ్మకమే ప్రధాన ఆయుధం. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలు ప్రజల్లోకి బలంగానే వెళ్లినప్పటికీ వారు వాలంటీర్లు వ్యవస్థను నమ్ముతారా లేదా అనేది కీలకం కానుంది. ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారం ఎటు వెళుతుంది అనే ప్రశ్నతో పాటు నానక్ రాం గూడ లో ప్రత్యేక కార్యాలయంలో దీనిని పర్యవేక్షిస్తున్నారు అన్న సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది. అయితే వాలంటీర్లు ఎందుకు సమాచారం సేకరిస్తున్నారు అన్న ప్రశ్నలు ఇప్పటికే ప్రజల్లో ఉదయిస్తున్నాయి. మా విలువైన సమాచారం బ్యాంకు ఎకౌంట్లు తో సహా తీసుకొని ఏం చేస్తున్నారు అనేది సామాన్య ప్రజల్లో కూడా మదనం మొదలైంది. ఇప్పుడు ఇదే వచ్చే ఎన్నికల్లో ఎటు వెళుతుంది అన్నది కీలకం. వాలంటీర్ల సేవలు మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంటే కొన్ని వర్గాల్లో సదభిప్రాయం ఉంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలు ఏ వర్గాలను ఎటు ప్రభావితం చేస్తాయి ఏమిటి అన్నది రాబోయే కాలంలో తెలుస్తుంది. ఇక జగన్ పెట్టబోయే కేసులు పవన్ కళ్యాణ్ కు అడ్వాంటేజ్ అవుతాయి తప్ప ఆయనకు ఏమాత్రం ప్రతికూలంగా మారవు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు పవన్ సరైన సమాధానం చెప్పకపోతే అరెస్టు వారెంటు జారీ చేసే అవకాశం ఉంటుంది. అదే కనక జరిగి పవన్ కళ్యాణ్ అరెస్టు అయితే ఆయన విజయావకాశాలు మరింత మెరుగుపడతాయి. అయితే ఈ విషయంలో వాలంటీర్ల అంశాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది కీలకం.