తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీలో రాజకీయం వేడెక్కుతుంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేస్తున్న వ్యాఖ్యలు వేస్తున్న అడుగులు అధికార పార్టీకి దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో బలహీన పడినట్లు భావిస్తున్న అధికార పార్టీకి సొంత పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తుండడం, పలకలు బోనడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చినీయంశంగా మారింది.
దేనికైనా రెడీ అంటున్న బోస్
జగన్ మంత్రివర్గంలో పదవులను తీసివేసిన దగ్గర నుంచి బోస్ వైఖరిలో మార్పు వచ్చింది. తర్వాత రాజ్యసభకు పంపినప్పటికీ ఆ కారణంగా తనను తొలగించారని ఆయన భావిస్తున్నారు. తర్వాత బోస్ సొంత నియోజకవర్గంలో రామచంద్రపురం నుంచి గెలిచిన చల్లబోయిన వేణుకు మంత్రి పదవి ఇవ్వడం తో ఆయన కోపం తార స్థాయికి చేరింది. సొంత నియోజకవర్గంలో వేరొక నేత పట్టు సాధించడం అలాగే, పాగా వేయడం సుభాష్ చంద్రబోస్ కు నచ్చలేదు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో కూడా రామచంద్రపురం నుంచి వేణు బరిలో నిలుస్తారని అధికార పార్టీ నుంచి సంకేతాలు వచ్చాయి. కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న బోస్ కు వచ్చే ఎన్నికల్లో కూడా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని పార్టీ నుంచి సంకేతాలు వెలవడంతో బోస్ ఇప్పుడు తన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ నేరుగా బరిలోకి నిలుస్తారని ఒకవేళ అధికార పార్టీ టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తారని ఇప్పటికే బోస్ అనుచరులు రామచంద్రపురం నియోజకవర్గం లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. మరోపక్క బోసు కొడుకు సూర్య ప్రకాష్ కు రామచంద్రపురం టికెట్ కేటాయించాలని గట్టిగా బోస్ అధిష్టానం వద్ద అడుగుతున్నారు. తమ సొంత నియోజకవర్గంలో తన కొడుకుకు కచ్చితంగా టికెట్ కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు. అయితే మంత్రి సిట్టింగ్ స్థానం నుంచి ఆయనను బయటకు పంపితే చెడు సంకేతాలు వెళ్తాయి అని వైసిపి అధిష్టానం బోసుకు సర్ది చెబుతోంది. దీంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బోస్ ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రామచంద్రపురంలో కచ్చితంగా అధికార పార్టీకి ఎదురుగాలి వేయడం తథ్యం. బోస్ ను అనుసరించి ఆయన అనుచరుగానం కూడా పార్టీ నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.