ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తుంది. అధికార వైసిపి పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ టిడిపి జనసేన పార్టీలు ఆరోపణల అస్త్రాలు గుప్పిస్తున్నాయి. నిన్నటి వరకు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూ పార్ట్ టైం రాజకీయాలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యక్షంగా పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయ కేంద్రంగా కార్యకర్తలు ఉంటాయనిపవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేనకు అనుకూలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర ద్వారా ప్రజల ముందుకు వెళ్లారు. అన్నవరంలోని సత్యదేవుని దర్శించుకున్న అనంతరం కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహించి నాలుగేళ్ల వైసిపి అవినీతి చేసింది అంటూ విరుచుకుపడ్డారు. ఈసారి అసెంబ్లీకి వెళ్లి తీరుతానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా ముఖంగా స్పష్టం చేశారు. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా ఆయా నియోజకవర్గాల్లో రెండురోజులపాటు బసచేసి ఆ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకొని లోతైన అధ్యయనం చేసే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకరం చుట్టారు . వైసిపి ప్రభుత్వం హయాంలో రంగాలవారీగా నెలకొని ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయా రంగాల ప్రముఖులతో మాట్లాడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రముఖులు వ్యాపారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులతో భేటీ అయ్యి స్థానికంగా ఉన్న సమస్యలు ఆ రంగాల వారీగా వారు ఎదుర్కొంటున్న సమస్యల పైన లోతైన చర్చ జరిపారు. వాటి పరిష్కారానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై వారితో చర్చలు జరుపుతున్నారు.
రంగాల వారీగా సమస్యలు.
కేవలం సాధారణ సమావేశాలే కాకుండా ఆయా రంగాల్లోని ప్రముఖులతో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక సమయం కేటాయిస్తూ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, క్షేత్రస్థాయిలో మారుతున్న జీవన విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కనీసం త్రాగునీరు కూడా దొరకని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని కొంతమంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సాగు నుండి ప్రాజెక్టులు ముందుకు కదలకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సాగునీటి వెతలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టవలసిందిగా పవన్ కళ్యాణ్ కు సూచించారు. సంక్షేమం పేరుతో వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టడంతో గ్రామాల పరిస్థితి దీనంగా ఉందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిందని, పేదలు మరింత పేదలుగా మారుతూ పన్నులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కష్టాలను పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి జీవన విధానం మెరుగుపరచడానికి ఎలాంటి పాలసీలు తీసుకురావాలో అధ్యయనం చేయడం కోసం ఇలాంటి భేటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, సమాజంలో అన్ని వర్గాల ప్రజల మాటలు విన్నానని వారికి ఎలాంటి పాలన విధానాలు కావాలో తెలుసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయా ప్రాంత మనుగడకు చేయాల్సిన ప్రణాళికలను త్వరలోనే నిర్ణయాలు తీసుకొని ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.