ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా?? ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి చెబుతున్నట్లు పూర్తి కాలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొనసాగేది కష్టమేనా అంటే?? దీనిలోనూ స్పష్టత కనిపించడం లేదు. ఒక పక్క స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని చెబుతుండడం మరోపక్క మంత్రులు సైతం ఇదే తీరును కొనసాగిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏకంగా వారాహి యాత్ర మొదటి రోజే ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తాయని గంటపదంగా చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చినీయంశం అవుతుంది. పవన్ కళ్యాణ్ కు అంత ఖచ్చితమైన సమాచారం ఏమి ఉంది అన్నది కూడా అంతుబట్టడం లేదు. ఏకంగా వైసీపీ పెద్దలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరిపారని, త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు.
ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరిగిన ప్రతిసారి సీఎం వైయస్ జగన్ రెడ్డి దానిని ఖండిస్తూ ప్రకటనలు ఇవ్వడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు సాధారణ సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని ఆయన చాలాసార్లు సూటిగా చెప్పారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అప్పుడున్న పరిస్థితులకు తగినట్లుగా ప్రభుత్వం నడుచుకోవచ్చు. రాజకీయ వ్యూహంలో భాగంగా కూడా తప్పుడు సమాచారాన్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పదేపదే ముందస్తు ఎన్నికలు రావు అని చెప్పడం వెనుక ఇలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పడం తో ఇప్పుడు చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా దీనికి కట్టుబడి ఉంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబుకు ఎప్పటినుంచో తెలుసు. ఈ కారణంతోనే యువగలం యాత్రను మొదలుపెట్టడంతో పాటు తాను కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పుడు జనసేన కూడా పూర్తిస్థాయి ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకుంది. దీంతో మూడు పార్టీల మాటలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కచ్చితంగా ఎన్నికలు ముందస్తుగానే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.