fbpx

రాధ రాజకీయం.. అంతా అయోమయం

Share the content

కాపులంతా దేవుడిగా భావించే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా ప్రయాణం ఎటువైపు సాగుతుంది అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపుల్లో చర్చనీయాంశంగా మారుతున్న అంశం. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసిన వంగవీటి రాధా తర్వాత కాలంలో టిడిపికి అంటి ముట్టినట్లుగానే ఉన్నారు. టిడిపిలో కీలక పాత్రకు పూర్తిస్థాయి దూరంగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున బరిలో నిలుస్తారు ఎక్కడి నుంచి పోటీలో ఉంటారు అన్నది రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారుతుంది.

జనసేన లోకి వస్తారా?

వంగవీటి రాధా జనసేన పార్టీలోకి వస్తారా అన్నది మొదటి నుంచి అయోమయ పరుస్తున్న అంశం. జనసేన పార్టీలో చేరికలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధా నివాసానికి వెళ్లి మరి ఆయనను కలవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. మచిలీపట్నం జనసేన ఆవిర్భావ సభ వేదికగా వంగవీటి రాధా పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇవేవీ పనిచేయలేదు కేవలం ప్రచారాలు గానే మిగిలిపోయాయి. వంగవీటి రాధా స్థిరంగా ఉండిపోయారు. అయితే వచ్చే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా వంగవీటి రాధా కీలకమైన స్టెప్ తీసుకోబోతున్నారు అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఆయన త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని బయట పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయవాడ మధ్య నియోజకవర్గం పరిధిలోని వంగవీటి రాధా పోటీ చేయబోతున్నారు అని జోరుగా చర్చ సాగుతోంది. మరి వంగవీటి రాధా ఏ పార్టీ తరఫున బరిలో నిలుస్తారు అనేది మాత్రం బయటకు రావడం లేదు. ఆయన సన్నిహితులు వద్ద కూడా దీని మీద సమాచారం లేనట్లు కనిపిస్తోంది.

మధ్య నియోజకవర్గంలో పోటీ అధికం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో ప్రస్తుతం బొండ ఉమా టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన టిడిపి పోలిట్ బ్యూరోలో కూడా ఉన్నారు. దీంతో వంగవీటి రాధా అనుకుంటున్నట్లుగా విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి ఈసారి ఆయనకు టికెట్ వస్తుందా రాదా అన్నది సందేహమే. ఒకవేళ టిడిపి జనసేన కలిసి సాగితే అప్పుడు అభ్యర్థిగా ఎవరు నిలబడతారు అన్నది అర్థం కాని విషయం. జనసేన పార్టీకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో బలమైన నాయకులు లేరు. కేవలం విజయవాడ పరిధిలో పశ్చిమ నియోజకవర్గం మాత్రమే జనసేన పార్టీ కోరే అవకాశం ఉంటుంది. దీంతో మధ్య తూర్పు నియోజకవర్గం ఖాళీగానే ఉండొచ్చు. అయితే జనసేన పార్టీకి తూర్పు మద్య నియోజకవర్గాల్లోనే బలం ఎక్కువ. కాపుల ఓటింగ్ చాలా అధికం. దీంతో వంగవీటి రాధా ఒకవేళ జనసేన పార్టీలోకి వస్తే ఆయనకు మధ్య నియోజకవర్గం కేటాయిస్తారా లేక టిడిపి ఈ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతుందా అన్నది కూడా కీలకం. ఒకవేళ తూర్పు నియోజకవర్గం సర్దుబాటు చేసి గద్దె రామ్మోహన్ ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెబితే, ఆ సీట్లో వంగవీటి రాధా ను నిలబెట్టే అవకాశం కూడా ఉంది. అయితే మొదటి నుంచి వంగవీటి రాధా సెంట్రల్ సీటు కోసం పట్టుబడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాధాకు ఏ పార్టీ నుంచి ఏ సీటు కేటాయింపు ఉంటుంది అన్నది ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. సీటు మీద పక్కా సమాచారం లేకపోవడంతోనే రాధా కూడా రాజకీయంగా ఏ పార్టీలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించుకోలేకపోతున్నారు అని తెలుస్తోంది. మరోపక్క వంగవీటి రాధా మిత్రుడు కొడాలి నాని సైతం మళ్లీ వైసీపీ లోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కచ్చితంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, జనసేన బలం పెరుగుతున్న వేళ కాపుల ఓట్లు కోసం వైసిపి ఖచ్చితంగా రాధాకు కీలక పదవి కట్టపెట్టే అవకాశం ఉంది అనేది కూడా రాజకీయ వర్గాల విశ్లేషణ. దీంతో రాదా స్టఫ్ ఎటువైపు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *