మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. ఆచంట నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పితాని సత్యనారాయణ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు చేతిలో ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి బరిలో నిలుస్తానని చెబుతున్న పితాని సత్యనారాయణకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. వేరే నియోజకవర్గం నుంచి ఏమైనా పితానికి టికెట్ ఇస్తారా అన్నది కూడా సందేహస్పదంగా మారింది.
చేగుండి సూర్య ప్రకాష్ కు అవకాశం..
వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంటే కచ్చితంగా ఆచంట సీటును జనసేన పార్టీ ఆశిస్తుంది. మాజీ హోంమంత్రి చేగుండి హరి రామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ రావు ఇక్కడి నుంచి టికెట్ కోరుతున్నారు. ఆయన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఆచంట సీటును పట్టుబడతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ చేగుండి సూర్య ప్రకాష్ కు ఆచంట సీటు కేటాయిస్తే పితాని సత్యనారాయణకు ఏ నియోజకవర్గం కేటాయిస్తారు అన్నది కూడా కీలకం కానుంది.
భీమవరం పంపుతారా?
పొత్తులో భాగంగా చేగుండు సూర్యప్రకాష్ కు ఆచంట పంపితే పితాని సత్యనారాయణ ను భీమవరం నియోజకవర్గం పంపుతారు అనే ప్రచారం బలంగా సాగుతోంది. గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన పులపర్తి ఆంజనేయులు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భీమవరం నియోజకవర్గ ఇన్చార్జిగా తోట సీతారామలక్ష్మి పని చేస్తున్నారు. అయితే ఒకవేళ సర్దుబాట్లు గనుక తప్పక పోతే పితాని సత్యనారాయణ కు భీమవరం కేటాయించి తోట సీతారామలక్ష్మికి ఎమ్మెల్సీ సర్దుబాటు చేస్తారని ప్రచారం కూడా ఉంది. దీంతో ఆచంట నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో కీలకం కానుంది. అయితే పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు జనసేన పార్టీ కోరుతుంది ఎన్ని టీడీపీకి వదులుతుంది అన్నది వచ్చే ఎన్నికల్లో సర్దుబాటు వరకు తేలేలా కనిపించడం లేదు.