వైసిపి పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా విజయ సాయి రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు. నిన్నటి వరకు ఈ స్థానంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. రాజకీయ విమర్శలు వివాదాలు కారణంగా ఆ బాధ్యతల నుండి బాలినేని శ్రీనివాస్ తప్పుకున్నారు.
దగ్గర చేసుకునే ప్రయత్నం…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం విజయసారెడ్డిని గౌరవించడమా అవమానించడమా అనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికల ముందు పార్టీలో కీలక రోల్ పాటించిన విజయ సాయి రెడ్డిని గత కొంతకాలం నుండి పార్టీ వ్యవహారాల నుండి దూరం పెట్టారు. ఈ విషయంపై విజయ్ సాయి రెడ్డి కూడా ఎక్కడ నోరు విప్పకుండ మౌనం పాటిస్తూ ఢిల్లీలో అజ్ఞాతవాసం గడిపారు. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు అనే ప్రచారం జోరుగా జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి బాలినేని స్థానంలో ఆయనను నియమించడం విజయ్ సాయి రెడ్డిని బుజ్జగించే వ్యవహారంగా కనిపిస్తుంది.
అవమానమా ఆదరణ..
మూడు జిల్లాల కోఆర్డినేటర్ గా నియమితులు కావడం అంటే మూడు జిల్లాల పెత్తనం ఆయనకు రాదు. జిల్లా కోఆర్డినేటర్లను నియమించినప్పటికీ పెత్తనం మాత్రం కొంతమంది పెద్దల వద్ద ఉంది. ప్రకాశం జిల్లా రాజకీయాలు మొత్తం వైవి సుబ్బారెడ్డి చేతిలోనే ఉంటాయి. అక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్న వైవి సుబ్బారెడ్డి పర్మిషన్ తప్పనిసరి. ఈ విషయం పైనే పోసకలేని బాలినేని శ్రీనివాస్ బాధ్యతల నుండి తప్పుకున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూడు జిల్లాల కోఆర్డినేటర్ పదవి అంటే ఎందుకు పనికిరాని పదవి అని ఒక అభిప్రాయం ఉంది. వైసిపి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన తనను ఇలా స్పెర్ గా వాడుకోవడం ఏంటని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతి చిన్న విషయంలోనూ ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా స్పందించే విజయ్ సాయి రెడ్డి జిల్లా కోఆర్డినేటర్ పదవిని ప్రకటించిన తర్వాత ఆయన స్పందించకపోవడం ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్లు జిల్లా కోఆర్డినేటర్ గా కొనసాగుతారా లేదా ఆ బాధ్యతలను వేరొకరికి అప్ప చెపుతారా అనే విషయంపై తెలియాల్సి ఉంది.