కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ ..కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్టే విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని ఆక్షేపించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది.వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ … వైఎస్సార్ కడప జిల్లా వైసిపి అధ్యక్షుడు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు.. వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ… ఏప్రిల్ 16వ తేదీన ఆదేశాలిచ్చింది. కడప కోర్టు ఉత్తర్వులను ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.షర్మిళ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.