వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్నికల వేల హింసకు కారణమైన నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా… కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను నియంత్రించడంలో పోలీసులు విఫలం చెందారు. నేడు ప్రశాంతమైన విశాఖకు కూడా ఆ హింస చేరింది. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి…టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు. పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం రాలేదు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలని కోరారు. మాచర్లలో మారణహోమానికి కారణం అయిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదని అన్నారు. విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు… పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.