ఈ నెల 13 న ఎన్నికల పోలింగ్ దృష్ట్యా తెలంగాణ నుంచి ఆంధ్రపదేశ్ కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపిఆర్టీఎస్ ఎండిని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు రానున్నారు.ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఓటు వేసేందుకు తమ ఊళ్లకు ప్రజలు ప్రయాణమవుతున్నారు. ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్ లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు.ఈ రెండు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.అదనపు బస్ లను కల్పించడం ద్వారా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు.