కాకినాడలో 2019 సంవత్సరంలో భవన నిర్మాణ కార్మికులపై నమోదు అయిన కేసును కాకినాడ మొబైల్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పోలీసులపై దాడికి పాల్పడ్డారని, పబ్లిక్ ని ఆటంకపరిచారని, మాజీ మంత్రి కన్నబాబు ఆస్తులును ధ్వంసం చేశారనే ఆరోపణలుతో 13 మందిపై పెట్టిన కేసు నిరూపణ కాలేదని కాకినాడ మొబైల్ కోర్టు పేర్కొంది. సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దువ్వ శేషాబాబ్జి, చెక్కల రాజ్ కుమార్ లు తెలిపిన వివరాల ప్రకారం …జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే “నూతన ఇసుక పాలసీ” పేరుతో ఇసుక తవ్వకాలు, అమ్మకాలను మూడు నెలల పాటు నిషేధించింది. దీనితో నిర్మాణరంగంపై ఆధారపడిన 25 లక్షల కుటుంబాలు ఉపాధి దొరక్క, అప్పులు పుట్టక కుటుంబాలను పోషించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇసుక త్వరగా విడుదల చేయాలని ఉపాధి కోల్పోయిన కార్మికులకు పదివేలు జీవన భృతి కల్పించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అండ్ అండ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం పిలుపుమేరకు రాష్ట్ర కేబినెట్ మంత్రి కన్నబాబు ఇంటికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లడంతో పోలీసులతో అడ్డుకుని, అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించారని వివరించారు.కార్మికులు గొంతు వినబడకుండా అధికార మదంతో భవననిర్మాణ కార్మికులు, సిఐటియు నాయకులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు.
ఆకలిమంటలతో సహాయం చేయాలని అర్ధించిన కార్మికులపట్ల జగన్ ప్రభుత్భం ఇంత నిర్బంధాన్ని పాల్పడడాన్ని కార్మికులు గమనించి జరుగుతున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఏపీ బిల్డింగ్ అండ్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించేంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది మహ్మద్ జవహర్ అలీ , వారి జూనియర్లు కె. దుర్గా భవానీ, ఆనంద్, నాగజ్యోతి లకు ధన్యవాదములు తెలియజేసారు.