ఫించన్ దారుల ఖాతాల్లో లావాదేవీలు జరగలేదని, మినిమం బ్యాలెన్స్ లేవని ఒక్కొక్కరి వద్ధ 300 నుండి 400 వరకు చార్జీలు వసూలు చేయడం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్ బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పి చార్జీలు వసూలుచేయడం అమానుష చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంచంపైన ఉన్న వారికి ఇంటివద్దే పంపిణీ చేస్తామని చెప్పి బ్యాంకుల్లో జమ చేసి, నానా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. పెన్షన దారుల నుంచి ఎటువంటి బ్యాంకు ఛార్జీలు వసూలు చేయకూడదని కోరారు. వసూలు చేసిన మొత్తాన్నా లబ్దిదారులకు తిరిగి ఇవ్వాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.49 లక్షల మంది ఫించన్ దారులు ఉంటే వారిలో 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయని ప్రభుత్వ అధికారులు ప్రకటించారన్నారు. రాజకీయ పార్టీలు, ఫించన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మొదట్నుంచీ మొత్తుకున్నా ….ప్రభుత్వ అలసత్వం ఫలితంగా పండుటాకులు ఎండ వేడి తాలలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులవద్ద సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయని అన్నారు.మంచంపై ఉండి బ్యాంకులకు వెళ్ళలేని వారికి ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పి, కదలలేని వారికి సైతం బ్యాంక్ ఖాతాల్లో వేశారు. ఆటోలు మాట్లాడుకుని, ఇతరులసహాయం తీసుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం. ఒక వైపు బిజెపి బ్యాంకుల ఛార్జీల పేరుతో వృద్ధుల సొమ్ము జమ చేసుకుంటుంటే మరోవైపు వైసిపి ఈ పరిణామాల్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందన్నారు. బిజెపి, వైసిపి, టిడిపిల రాజకీయ చదరంగంలో ఫించన్దారుల్ని బలిచేయడం తగదన్నారు.తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.