టీడిపి , జనసేన అధినేతలు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసిపి నాయకులు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైసీపీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం రౌతులపూడి మండలం ములగపూడి, రాజవరం, గంగవరం, దిగువశివాడ,ఎగువ శివాడ, రామకృష్ణాపురం కి చెందిన వైసీపీ నాయకులు, వైసిపి ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు ముద్రగడ నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు. ముద్రగడ నివాసానికి వచ్చిన వైసీపీ నాయకులుకి ముద్రగడ తనయుడు గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ …కాకినాడ పార్లమెంట్, పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో వైసిపి విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న వరుపుల సుబ్బారావును ,కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ప్రజలకు కుల మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ప్రత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ..ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని చూసి వైసిపి కి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు చిరస్థాయిలో నిలిచిపోయాయని అన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం పోటీ చేసినప్పుడు ..ఓట్లు వేయాలని ఎవరి మీద ఆయన ఒత్తిడి తీసుకురాలేదని తెలిపారు.ఈ ఎన్నికల్లో స్వయంగా ఆయన ఆసక్తి చూపించి కాకినాడ పార్లమెంట్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి విజయానికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.