రాజమండ్రి పేపర్ మిల్లుకి అర్థాంతరంగా లాకౌట్ ప్రకటించడం దుర్మార్గమని తక్షణమే లాకౌట్ ను ఎత్తివేయాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు డిమాండ్ చేశారు. కమిషనర్ ఆఫ్ లేబర్ స్థాయిలో జోక్యం చేసుకోని ఇరువర్గాలను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.నూతన వేతన ఒప్పందం కొరకు,గుర్తింపు సంఘ ఎన్నికలు కొరకు 13 కార్మిక సంఘాలు ఏప్రిల్ 2 నుంచి సమ్మె చేస్తున్నాయని తెలిపారు.కలెక్టర్ల సమక్షంలో చర్చకు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం మొండి పట్టుదలకు పోయిందని విమర్శించారు.కార్మికులకు జీతాలు పెంచాల్సి వస్తుందన్న ఉద్దేశంతో లాకౌట్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకోలేరన్న ధీమాతో యాజమాన్యం ఉందన్నారు.లాకౌట్ ను తొలగించి చర్చలు జరిపి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు.