గత ఎన్నికల్లో 25 కు 25 ఎంపిలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్పాలు పలికిన జగన్మోహన్ రెడ్డి….. అధికారం చేపట్టాక మాట తప్పి మడమ తిప్పారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు.సోమవారం రాజమహేంద్రవరంలో స్థానిక ఆనం రోటరీ హాల్ నందు ఇండియా కూటమి ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ “లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ” సభ జరిగింది. ఈ సందర్భంగా వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్ట హామీల అమలు కేవలం ఇండియా కూటమి తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఇండియా కూటమి గెలుపుతోనే ఏపీ అభివృద్ధి మలుపని అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో ప్రజా కంఠక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ కు విముక్తి కలిగించేందుకు ప్రతి ఒక్కరూ దీక్ష బూనాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా వైసిపి నిరంకుశ పాలన సాగిస్తుందని విమర్శించారు. వ్యవసాయం, పారిశ్రామిక, నీటిపారుదల రంగాల అభివృద్ధి అటకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రపదేశ్ ను అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని ధ్వజమెత్తారు.