ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వైసీపీకి, జగన్ అండ్ కంపెనీకి వీడ్కోలు పలకాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ రూరల్ లోని ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సమస్యలపై ప్రత్యేకమైన మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో కాపులకు ఎన్నో పథకాలు ఇచ్చి వారి అభివృద్ధికి నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ప్రకటించారు. టిడిపి, జనసేన, బీజీపీ ల అభ్యర్థులకే కాపుల మద్దతు ఉందని స్పష్టం చేశారు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున టీడీపీ ఆవిర్భవించిందని తద్వారా ఎందరికో రాజకీయాలలో ఉన్నత స్థానం లభించిందని గుర్తు చేశారు.
దుష్ట పాలనను అంతం చేద్దాం : వెంకటేశ్వరరావు
కాకినాడ రూరల్ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. టీడీపీ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు నియామకమై ప్రజల్లో సుస్థిర స్థానం సాధించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ గెలిపించాలని కోరారు. ప్రస్తుతం తెలుగుదేశం పాలన రాష్ట్రానికి అవసరమని దుష్ట వైసీపీ పాలన వల్ల రాష్ట్రం ప్రగతి పథంలో వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్ మాఫియాను ఇంటికి పంపుధాం : పంతం నానాజీ
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ…. గ్రామీణ స్థాయిలో అందరూ కలిసి సైకిల్, గాజు గ్లాస్ గుర్తులకు అశేషమైనటువంటి ప్రచారం కల్పించాలన్నారు. దీనికి కలిసికట్టుగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో జనసేన, టీడీపీ బలంగా ఉందని అందుకు బీజేపీ నేతలు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో డ్రగ్స్, మాఫియా, అవినీతి, అరాచక ప్రభుత్వమైన వైసీపీని ఇంటికి సాగనంపాలని సూచించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో స్థానిక సమస్యలను తెలియజేసే ఒక మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దొంగ పట్టాలను ఇచ్చేందుకు సంబంధిత ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఆ పట్టాలు నిజమైనవి కావని, అవి నకిలీ పట్టాలని ప్రజలు గ్రహించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని నానాజీ కోరారు. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు బసవా ప్రభాకర రావు, సిరంగు శ్రీనివాస్, మాధవరపు శ్రీనివాసరావు, జంక్షన్ బాబ్జి తదితరులు పాల్గొన్నారు