రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి చేపట్టనున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర రేపు ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నివాళులు అర్పిస్తారు.అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో భాగంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి,సర్వరాజుపేట,వీరపునాయనిపల్లి (కమలాపురం),, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు,యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అని తెలిపారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల,నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్,చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వెల్లడించారు.