రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ద. పురందేశ్వరుని ఓడించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ…. ప్రజాస్వామ్యాన్ని , లౌకిక తత్వాన్ని మానవత్వాన్ని మంటకలుపుతున్న బిజెపిని తరిమికొట్టాలని కోరారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు బిజెపి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికే పెద్ద పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మాణాన్ని విస్మరించారని విమర్శించారు.
కడప స్టీల్ ఫ్యాక్టరీ విశాఖ రైల్వే జోన్ విభజన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతుందని… కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా తో రాష్ట్రం కూడా అభివృద్ధి అయ్యేదని ఈ ఐదేళ్లలో కేంద్రం ఎటువంటి సహకారం రాష్ట్రానికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏమి చేశారని బిజెపికి ఓటు వేయాలని ప్రశ్నించారు .తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు కలవారని బీజేపీ పప్పులు ఇక్కడ ఉడకవని మధు అన్నారు. కావున అన్ని వర్గాల వారు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మధు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కే జ్యోతి రాజు, చింతలపూడి సునీల్, తోట లక్ష్మణ్, కే శ్రీనివాస్, జట్లు సంఘ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, తదితరులు పాల్గొన్నారు.