రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుబ్రహమణ్యం హత్య కేసులో కాపు ఓట్లు పోతాయని ఉద్దేశంతో ఒక్కమాట కూడా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏ ముఖం పెట్టుకొని పోటీ చేస్తారని జై భీం భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి జగ్గారపు మల్లిఖార్జున ప్రశ్నించారు. శుక్రవారం కాకినాడ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రశ్నిస్తాను ఎవరికి మద్దతు లేకుండా పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేడు ఏమయ్యాయని.. కేవలం చంద్రబాబు తొత్తుగా మాత్రమే ఆయన వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్ కు చేతకాదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను రాజకీయాలలో ఎదగనిస్తే అది భవిష్యత్తుకు, భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమని విమర్శించారు.పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటే,టీడిపి బిజెపి కూడా పోటీ చేసినట్లేనని, ఆ పార్టీలకు కూడా మేము వ్యతిరేకమన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని భార్యలను రోడ్డుపై వదిలేసిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలను వదిలేయరని నమ్మకం ఏముందన్నారు. నిలకడలేని, చేతకాని రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్రంలో ఏ ప్రాంతంపైన ఏ సమస్య పైన పూర్తి అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేస్తే అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తో కలిసి అనేక పోరాటాలు చేసి శిక్షలు పడేవిధంగా చేశామన్నారు. పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసిన వరప్రసాద్ తరపున నిలబడి పోరాటం చేసిన ఏకైక పార్టీ జైభీమ్ రావ్ భారత్ పార్టీ అని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోటు, జడ శ్రావణ్ కుమార్ కోటు, మా కోటు మా పార్టీ గుర్తుగా రావడం ఎంతో సంతోషంగా ఉందని, పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కోర్టు గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ భారత్ పార్టీ నాయకులు హరీష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.