రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడసిటీ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ జే.వెంకటరావు సూచించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నామినేషన్ల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయా పార్టీల ప్రతినిధులకు వివరించారు. నామినేషన్ ఎలాదాఖలు చేయాలి? ఇతర నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ పోటీచేస్తే అనుసరించాల్సిన నిబంధనలు ఏమిటి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా పాటించాలని కోరారు. అలాగే ఎన్నికల సందర్భంలో అభ్యర్థులు చేసే ఖర్చులను ఎలా దాఖలు చేయాలో వివరించారు. వీటితోపాటు అనేక అంశాలపై అవగాహన కల్పించారు. కాగా ఆయా ఎన్నికల బృందాల వెంట ఉండే వీడియోగ్రాఫర్లతో కూడా కమిషనర్ సమావేశమయ్యారు. ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ చేపట్టాల్సిన విధులను తెలియజేశారు. పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. సమావేశంలో రావూరి వెంకటేశ్వరరావు(వైఎస్ఆర్సీపీ), తుమ్మల రమేష్, బాలాజీ (టీడీపీ), పలివెల వీరబాబు(సీపీఎం)తోపాటు బీజేపీ, బీఎస్పీ వంటి వివిధ పార్టీల ప్రతినిధులతోపాటు డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, డీసీపీ హరిదాసు, తహసీల్దార్ దొర, డిప్యూటీ తహసీల్దార్లు సీతాపతిరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.