గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.68వేలకోట్లు ఖర్చు పెడితే, వైసిపి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.22వేలకోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు సాగునీటిప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టిన ఖర్చులో 3వ వంతు కూడా జగన్ రెడ్డి తన పాలనలో పెట్టలేదని మండిపడ్డారు.. అలాంటి వ్యక్తి ప్రాజెక్టులు నిర్మించానని..వాటిని జాతికి అంకితం చేస్తున్నానని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై, కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టినా ఏనాడూ జగన్ రెడ్డి స్పందించిందిలేదు. మాట మాత్రంగా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ, కేంద్రానికి గానీ ముఖ్యమంత్రి హోదాలో లేఖలు కూడా రాసిందిలేదు. జగన్ రెడ్డి చేతగానితనంతో చివరకు రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారింది. సీమవాసులకు తాగడానికి నీరుకూడా దొరకని దుస్థితి ఏర్పడింది. సాగునీటి రంగంలో రాష్ట్ర రైతాంగానికి వ్యతిరేకంగా జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ఫలితం రైతులకు శాపంగా మారింది. జగన్ నిర్ణయాల ప్రభావం..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూలంగామారి, రైతుల ఆగ్రహంతో ఆ పార్టీ రాష్ట్రంలోనే లేకుండా చేస్తారని తెలిపారు.