అగ్నికి వాయువులా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తోడు అయ్యారని, ఇక వైసిపి బూడిదే అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. టిడిపి, జనసేన కార్యకర్తలు వైసిపిని తగలబెట్టేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. టిడిపి, జనసేన ఉమ్మడిగా నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా` సభ తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగింది. ఈ సభకు చంద్రబాబు, పవన్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వైసిపి దొంగలపై పోరాటం చేయాలని కోరారు.టిడిపి-జనసేన కొట్టే దెబ్బతో వైసిపి ముక్కలు ముక్కలావని పిలుపునిచ్చారు. టిడిపి జనసేన పొత్తు సూపర్ హిట్, ఆంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్ అని చెప్పారు. ఒక పార్టీ వెనుక మరో పార్టీ నడవడం లేదని, ఇరు పార్టీలు కలిసి నడుస్తున్నాయని చెప్పారు. జనసేన, తమది ప్రజలు కుదర్చిన పొత్తు అని, ఐదు కోట్ల రాష్ట్రల ప్రజల భవిష్యత్తు కోసం తాము చేతులు కలిపామని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు..
ఎన్నికల ముందు ముద్దుల పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పిడిగుద్దులు గుద్దారని విమర్శించారు. టిడిపి తీసుకొచ్చిందనే కక్షతో అమరావతిలో విట్, ఎస్ఆర్ ఎం, యూనివర్సీటీలకు రోడ్లు వేయలేదన్నారు.క్రికెటర్ హనుమా విహారిని సైతం వైసిపి వదల్లేదని, జగన్ దెబ్బకు అతను పారిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. చెల్లి, తల్లిపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేయించే దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తామిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నామని, త్యాగాలు కైన తాము సిద్ధమన్నారు. జగన్ వైనాట్ 175 అంటున్నారని, తాము వై నాట్ జాబ్ క్యాలెండర్, వైనాట్ డిఎస్సి, అంటున్నామని చెప్పారు. సిపిఎస్ రద్దు, మద్యం నియంత్రణ లేదన్నారు. జగన్ మాయ మాటలు చెప్పే బ్లఫ్ మాస్టర్ అని విమర్శించారు.
కుప్పానికి నీళ్లు అని ముఖ్యమంత్రి నాటకం
సినిమా సెట్టింగులతో నీళ్లు వదిలారని, మరుసటి రోజు అక్కడ నీళ్లు లేవన్నారు. అతని విశ్వసనీయత ఇలానే ఉంటుందన్నారు. తన నియోజకవర్గం కుప్పంలో లక్ష మెజార్టీ తనకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ది పాత సినిమా అని, సినిమా అట్టర్ ప్లాప్ అన్నారు. దీనికి సీక్వెల్ ఉండదన్నారు. 40 రోజుల్లో వైసిపి రౌడీలకు అసలు సినిమా మొదలవుతుందన్నారు. మొదటి విడతలో 99 సీట్లు ప్రకటించామని, మిగిలిన సీట్లను కూడా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. త్వరలో ఉమ్మడి మానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. బిసి, ఎసి, డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు. అందరికీ సీట్లు ఇవ్వకపోవచ్చునని, పని చేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఇద్దరం తీసుకుంటామని హామీ ఇచ్చారు.అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.