ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలను వాడరాదన్న చట్టాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఏ చట్టం పాటిస్తుంది? రాజకీయ లబ్ధి కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాధనం నుంచి రూ.25 కోట్లు ఖర్చు చేసి రెండు హెలికాఫ్టర్లు తీసుకోవడం బాధ్యత రాహిత్యమని ఎద్దేవా చేశారు. తాడేపల్లిగూడెంలో జనసేన,టిడిపి ఉమ్మడిగా నిర్వహించబోయే బహిరంగ సభ ప్రాంగణం ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.సభ ఏర్పాట్లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో భద్రత కారణాలతో ప్రభుత్వ హెలికాఫ్టర్లును వాడే అవకాశం కేవలం ప్రధాన మంత్రి కే ఉంటుంది అని స్పష్టం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఏ భద్రత కారణాలతో ఇబ్బంది పడుతున్నారో…ప్రజల డబ్బు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల డబ్బుని పార్టీ కోసం ,ఎన్నికల ప్రచారం కోసం ఎలా వినియోగిస్తారు ? అవినీతిలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి తన సొంత నిధులతో హెలికాప్టర్లు పెట్టుకొలేకపోయారా అని ప్రశ్నించారు. హెలికాఫ్టర్ల వ్యవహారం వెనుక ఉన్న అధికారులు దీనికి ఖచ్చితంగా భాధ్యత వహించవలసి ఉంటుంది అని హెచ్చరించారు.రాబోయే ప్రభుత్వంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపి…బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పారదర్శకతతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు
రాబోయే ఎన్నికల్లో అత్యంత పారదర్శకత తో కూడిన ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నాం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలో వివరిస్తారు అని తెలిపారు.ఎన్నికల ప్రణాళిక గురుంచి ఇరు పార్టీల నేతలు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.జగన్ రెడ్డి ప్రభుత్వం పై విసిగెత్తిపోయిన ప్రజల తరుపున గళం విప్పబోయే ప్రతి ఒక్కరినీ అభినందిస్తాము అని పేర్కొన్నారు. టిడిపి,జనసేన కార్యకర్తలు, అభిమానులు సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తాడేపల్లి గూడెం ఇంఛార్జి బోలిసెట్టి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.