కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఎవరికి కేటాయించినా కలిసి పనిచేయాలన్న అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు తెలిపారు. శుక్రవారం రూరల్లోని వలసపాకల గ్రామంలో పిల్లి దంపతులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ సీటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తున్నారని అయితే ఈసారి పొత్తులో భాగంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో కొందరు తమ పార్టీకి చెందిన నేతలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
తాజాగా తమ పార్టీకి చెందిన నాయకులు తమ కుటుంబానికి టీడీపీ టికెట్ కేటాయించాలని లేనిపక్షంలో ఇతర పార్టీలకు కేటాయిస్తే వారికి పని చేయనని చెప్పడం కేవలం తన మీద ఉన్న అభిమానమేనన్నారు. సీఎం జగన్ ప్రజలను పీడిస్తున్నాడని అతనికి జరగనున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పూర్తిస్థాయి క్షేత్రస్థాయి ప్రచారంలో ప్రత్యక్షంగా ఉంటామని చెప్పారు. తమ కుటుంబం తెలుగుదేశం పార్టీని వదిలేది లేదంటూ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తిలు స్పష్టం చేశారు.