గత ఐదు సంవత్సరాలుగా యువజన సంఘాలు, నిరుద్యోగులు అనేక పోరాటాలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం చివరిలో గ్రుప్ 2 నోటిఫికేషన్ 897 పోస్టులకు ఇచ్చింది. కానీ అభ్యర్థులకు ప్రిపరేషన్ కు సరైన సమయం ఇవ్వకపోవడం, సిలబస్ మార్పు చేయడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇదే విషయాన్ని ఎపిపియస్సి అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు వై. రాము, జి. రామన్న విమర్శించారు. నిరుద్యోగులు అభీష్టం మేరకు నెల రోజుల పాటు గ్రుప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎపిపియస్సి అధికారులు అవసరమైతే నిరుద్యోగుల అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎపిపియస్సి నిరుద్యోగులకు శాపంగా మారకూడదని అన్నారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని రకాల పోటీ పరీక్షలకు వయస్సు 44 సంవత్సరాలు ఉంటే ఎపిపియస్సి నిర్వహించే పరీక్షలకు మాత్రం వయస్సు 42 పెట్టడం ఎమిటి అని ప్రశ్నించారు. ప్రిలిమ్స్ నుండి మొయిన్స్ కు 1 :50 నిష్పత్తిలో తీసుకోవాలని కోరారు. తక్షణమే ఎపిపియస్సి అధికారులు నెల రోజుల పాటు ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమీర్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.