కాకినాడ భానుగుడి నుంచి ఆశ్రమ్స్కూల్ జంక్షన్ వరకు హరితనగరాల్లో భాగంగా రూ.1.90 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులతో ప్రతిపాదించిన స్మార్ట్రోడ్ నిర్మాణ పనులకు, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు శనివారం శంఖుస్థాపన చేశారు. స్థానిక జేఎన్టీయుకే సమీపంలో శనివారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ… ప్రజల సౌకర్యార్థం నిర్ధేశించిన ప్రాంతంలో సుందరీకరణ, అధునాతన టాయ్లెట్స్, బస్షెల్టర్లు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. తనతోపాటు ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రజలకు మెరుగైన వసతులు, అధునాతన సదుపాయాలు కల్పించేందుకు సీఎం సహకారంతో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అందువల్లే కాకినాడ స్మార్ట్సిటీ దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొంది ఇటీవలే సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్, పారిశుద్ధ్య విభాగాల్లో రెండవ స్థానాన్ని సాధించిందన్నారు. రానున్న రోజుల్లో కాకినాడ ఉత్తమ నగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్ఈ పి.సత్యకుమారి, సివిల్సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, జేఎన్టీయుకే డైరెక్టర్ బెజవాడ వీరవెంకటసత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జి, మాజీ కార్పొరేటర్లు ఐ.శ్రీను, రాజారాపు వెంకటలక్ష్మికృష్ణ తదితరులు పాల్గొన్నారు.