కన్న తల్లికి పట్టెడన్నం పెట్టనివాడు… ప్రేమ పూర్వకంగా పలకరించని వాడు…పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తాడు అంటే నమ్ముతామా? అన్న మారిపోయాడని… అన్న ఒక అవినీతి పరుడు,అసాంఘిక శక్తి అని మీ చెల్లలు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు షర్మిల అంటున్నారు…మీరు మీ సొంత చెల్లిని చూడరు…బాబాయ్ కూతురుకి న్యాయ సహాయం చేయరు..కానీ ఇతరలుని మాత్రం ప్రేమగా లాలిస్తారా? ఇది మీ విపరీత మనస్తత్వం కాదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టిడిపి నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇంత విపరీత,చించల మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికే వీలులేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరి లో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ …కోడి కత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావు శ్లేష్మం లో చిక్కుకున్న ఈగ లా ఐదేళ్లు పైబడి కారాగారంలో కొట్టుమిట్టాడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.జగన్మోహన్ రెడ్డి కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెబితే అతను బయటకి వస్తాడు.మీరు పన్నిన కుట్రలో శ్రీనివాస్ పావు కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి విపరీత మనస్తత్వం కాదా అని ప్రశ్నించారు.
గొంగళి పురుగు సీతాకోక చిలుక గా మారినట్లు.. ఒక నాటి పేద వ్యక్తి గా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఐదేళ్లలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపంతరం చెందారని ప్రశ్నించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ను అరెస్ట్ చేసిన ఈడి కి 11 ఏళ్లుగా చార్జి షీట్ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు. 2004 లో చిన్న ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి …ప్రస్తుతం టాటా , బిర్లా లతో సమానంగా పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. 2004 లో 2 కోట్ల 12 లక్షలు ఉన్న జగన్ ఆస్తి… 2011లో కడప ఉప ఎన్నిక అఫడవిట్ లో 445 కోట్లు ఆస్తి ఉందని అన్నారు. ఏడు సంవత్సరాల లో ఇంత ఆదాయం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. లోటస్ పాండ్ బంగ్లా ఎవరది? బెంగుళూర్ లో 29 ఎకరాల్లో అమెరికా అధ్యక్షుడు శ్వేత సౌధన్ని మించిన బంగ్లా ఎవరది? కడప లో బంగ్లా ఎక్కడది…చెన్నై లో బంగ్లా ఏక్కడది..విదేశాల్లో కూడా మని లాండరింగ్ జగన్మోహన్ రెడ్డి చేశారని సీబీఐ పేర్కొంది అని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండగా .. బడా బడా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ పరంగా రాయితీ లు ఇప్పించారు..ఎకరం 50 లక్షలు విలువ చేసేదాన్ని కేవలం రూ.50,000 లకు ఇచ్చారు. అలా 28,000 ఎకరాలు వాన్ పిక్ కి ఇప్పించారు అని మండిపడ్డారు. లాభసాటి వ్యాపారం కానీ పత్రిక రంగంలో వాన్ పిక్ యాజమాన్యం 800 కోట్లు పెట్టుబడి ఎలా పెడతారని ప్రశ్నించారు. వాన్ పిక్ లో లబ్ధి పొందిన యాజమాన్యం ఆ సొమ్మును సాక్షి పత్రికలో …జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. ఇంత అవినీతి సామ్రాట్ అయిన జగన్మోహన్ రెడ్డి ని.. “మా నమ్మకం… నువ్వే జగన్” అంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు.