కాకినాడ జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిధ్యాలయం పదవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్శిటీ అలూమ్ని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, యూనివర్శిటీ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవ వేడుకలకు మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్ వెంకట శేషాచారి మరో ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి రాజన్నకి గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. గవర్నర్, కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పిహెచ్డి అవార్డు గ్రహీతలు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ … వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలోని యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో విద్యా సంస్థల యొక్క బాధ్యత ఎంతో ఉందన్నారు. ప్రజల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. తమను తాము విశ్వసించాలని, తమ జ్ఞానం, సామర్థ్యాలపై అత్యంత విశ్వాసం చూపాలని సూచించారు. ప్రకాశవంతమైన రేపటి కోసం ఆశాజనకంగా ఉండాలని కోరారు.
మరో అతిథి ఎస్ వెంకట శేషాచారి మాట్లాడుతూ…. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను ఒడిసిపట్టాలని, ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు దూసుకువెళ్లాలని కోరారు. జ్ఞానం వివేకాన్ని పెంపొందించాలని, ఉద్యోగాలకై ఆశించక వ్యవస్థాపకులుగా మారాలని సూచించారు. ముఖ్యంగా ఫైనాన్స్, లాజిస్టిక్స్, మానవ వనరుల నిర్వహణ, విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే పరిశ్రమల కోసం ఆర్ఇడి ప్రాజెక్ట్లను ప్రోత్సహించాలని ఆయన కోరారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, భవిష్యత్తులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు కృషి చేస్తుందన్నారు.
ఉపకులపతి ప్రొఫెసర్ జివిఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ…. జెఎన్టియుకె యూనివర్శిటీ 3.45 స్కోర్తో న్యాక్ ఏG గ్రేడ్ పొందిందని సగర్వంగా సభకు తెలియజేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపి) 2020 ప్రకారం ఆర్`23 సిలబస్ను రూపకల్పన చేశామన్నారు. స్వీయ అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపర్చడం కోసం మరిన్ని ఆన్లైన్ కోర్సులను ప్రారంభించబోతున్నామన్నారు. జెఎన్టియుకెలో పరిధిలోని 22 ఇంజనీరింగ్ మరియు ఫార్మశీ కళాశాలలు 2023-2024 విద్యా సంవత్సరం నుండి స్వయం ప్రతిపత్తి పొందాయని యుసిఇకె చరిత్రలో మొట్టమొదటిసారిగా సిఎస్ఈ మరియు ఈసిఈ విభాగాలకు చెందిన నలుగురు విద్యార్థులు బహుళజాతి కంపెనీలలో మెరుగైన ప్యాకేజీలతో నియామకాలు పొందారన్నారు. ఏపిఎస్సిహెచ్ఇ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఉపకులపతి జివిఆర్ ప్రసాదరాజు గవర్నర్, ఛాన్స్లర్ ఎస్ అబ్దుల్ నజీర్ని శాలువాతో సత్కరించి మెమెంటోను బహూకరించారు. అత్యంత వైభవంగా జరిగిన జెఎన్టియుకె 10వ స్నాతకోత్సవ వేడుకలకు రెక్టార్ కెవి రమణ వందన సమర్పణ చేశారు.
పదవ స్నాతకోత్సవంలో 64మందికి పిహెచ్డి అవార్డులు, 21మందికి బంగారు పతకాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జెఎన్టియుకె పాలక మండలి సభ్యులు, రెక్టార్ కెవి రమణ, రిజిస్ట్రార్ ఎల్ సుమలత, ఓఎస్డి డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మాజీ ఉపకులపతులు, జెఎన్టియుకె కళాశాలల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, విద్యావేత్తలు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ప్రొఫెసర్లు, విభాగాధిపతులు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, పిహెచ్డి అవార్డు గ్రహీతలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.