రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా డిఎస్సీ ప్రకటనపై నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిందని డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు వై రాము,జి.రామన్న విమర్శించారు.గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగ యువత డిఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1.69 లక్షలు మాత్రమే ఉన్నారన్నారు.18,520 ఖాళీగా ఉన్నాయని ఇవే కాక ఈ నెల చివరి నాటికి మరో 5000 మంది రిటైర్డ్ అవుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 40,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు.తెలుగు మీడియం ను రద్దు చేసి 15,000 పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వర్తిస్తుందని ఎద్దేవా చేశారు.
గతంలో 117 జీవోతో మరో 10,000 పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ద్రాపౌట్ అవుతూ …ప్రవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యా విధానంను రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.కృష్ణ,యన్.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.