ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్యవాద కలను సాకారం చేసిన మహానేత వ్లాదిమిర్ లెనిన్ అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. లెనిన్ వర్ధంతి సందర్భంగా ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సామర్లకోట శాఖ ఆధ్వర్యంలో ” కార్మిక వర్గం పోరాట కర్తవ్యాలు” అనే అంశంపై ఏఐటియుసి కార్యాలయంలో సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రప్రదమ సోషలిస్టు రాజ్య నిర్మాత వి ఐ లెనిన్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ మానవాళి విముక్తికి మార్క్స్, ఏంగెల్స్లు “కమ్యూనిస్టు మానిఫెస్టో” సిద్ధాంతాన్ని అందించారని..ఆ సిద్ధాంతానికి తన ఆలోచనలను జత చేసి ఆచరణలో పెట్టి సామ్యవాద కలను సాకారం చేసిన మహానేత లెనిన్ అని తెలిపారు. లెనిన్ అనే పేరు మూడు అక్షరాలే.. కాని ప్రపంచ ప్రజలందరికీ విముక్తి ఆయుధపు ధ్వని లెనిన్ అని వెల్లడించారు. ఆయన జీవించింది యాభై నాలుగేండ్లే కావచ్చు.. కానీ వందేళ్ల తర్వాత కూడా ఆయన అందించిన విప్లవ స్పూర్తి నిలిచి ఉందన్నారు. నేడు అభివృద్ధి చెందిన దేశాలలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు పెద్దయెత్తున తమ ఇక్కట్లపై నిరసనలు తెలుపుతున్నారని వీటిని అణచేందుకు ఫాసిస్టు తరహా పాలన విస్తరిస్తోందని.. అయినా చరిత్ర గమనంలో విముక్తి పథం ఆగదని ధీమా వ్యక్తం చేశారు. లెనిన్ జీవన విధానం కమ్యూనిస్టులకు శిరోధార్యం అని పేర్కొన్నారు. నిబద్ధ కార్యకర్తలుగా నిలబడటానికి ఆయన జీవితం స్పూర్తినిస్తుందని తెలిపారు.
రష్యా అధినేత అయిన తరువాత కూడా నైతిక మానవీయతలతో కూడిన జీవన విధానం ఆయన కొనసాగించారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారం, వసతులు అవసరమని డాక్టర్లు మొరపెడుతున్నా…. ప్రజలు హీనంగా జీవిస్తున్నపుడు, వాళ్ల కన్నా మంచిగా జీవించే నైతిక హక్కు నాకు లేదని తిరస్కరించిన నేత లెనిన్…సమ సమాజపు వెలుతురు కోసం తనను కొవ్వొత్తిలా కరిగించుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాలను కార్మికవర్గం ముందుకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టు పార్టీ కాకినాడ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు పిఎస్ నారాయణ, సామర్లకోట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బచ్చ శీను, కసింకోట ఆనందరావు, పిఠాపురం మున్సిపల్ కార్మికుల నాయకుడు కె రామకృష్ణ, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎలిశెట్టిరామదాసు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు సప్త సూరిబాబు, బర్ల లక్ష్మీనారాయణ, ఆడప చిట్టిబాబు, దరంపూడి రాజు, అల్లూరి భద్రం, సోమాధుల సింహాచలం, మంగళగిరి దుర్గా మనమ్మ మనీ అల్లం అప్పారావు గూడూపు బాలయ్య చెన్నవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.