శ్రామిక వర్గ విప్లవ నేత 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్టు మేధావి కామ్రేడ్ వి.ఐ.లెనిన్ శత వర్ధంతి 2024 జనవరి 21 నుండి ప్రారంభమై సంవత్సరం పొడవునా వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతాయని సిపిఎం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి సభలు జరపాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రగతిశీలవాదులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని నివాళి అర్పించాలని విజ్ఞప్తి చేశారు.ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం సోవియట్ యూనియన్ సాధించిన ఘనత లెనిన్ నాయకత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. కష్టపడి సంపద సృష్టించే వర్గాలు రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వృత్తి దారులు తదితరులకే సంపదపై అధికారం ఉండాలని లెనిన్ పోరాడార న్నారు.
అసమానతలు లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని పేర్కొన్నారు. అమానుషమైన పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆయన ఆచరణలో రుజువు చేశారని గుర్తు చేశారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ దశలో ప్రజల సంపద కార్పొరేట్ పాలవుతున్న కాలంలో లెనిన్ ఆవశ్యకత మరింత పెరిగిందని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని లెనిన్ గట్టిగా బలపరిచారని తెలిపారు. సామాజిక అణిచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆనాటి సామాజిక ఉద్యమాలని ఆయన ప్రత్యేకంగా గమణంలోకి తీసుకున్నారన్నారు. ఇంత దూర దృష్టి కలిగిన మహా నాయకుడు శత వర్ధంతిని జరుపుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. యువత బంగారు భవిష్యత్తుకు దారీ చూపే భారతదేశ అభ్యున్నతికి లెనిన్ సిద్ధాంతం మార్గదర్శకం అవుతుందని వెల్లడించారు. ప్రజలందరూ ఈ సందర్భంగా జరిగే సభలు, సమావేశాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.