అంబేద్కర్ మహా శిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీటర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 19న విజయవాడ వద్ద స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న అంబేద్కర్ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహమని పేర్కొన్నారు.అంబేద్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ప్రతీక అని పేర్కొన్నారు. 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన,125 అడుగుల మహా శిల్పమని,206 అడుగుల ఎత్తైన విగ్రహమని వెల్లడించారు. దేశ సామాజిక ,ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయిని వెల్లడించారు. ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని నవరత్నాల ద్వారా అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని తెలిపారు.
రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి అంబేద్కర్ అని వెల్లడించారు. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి అని తెలిపారు.కులాలు, మతాలకు అతీతంగా, పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు అంబేద్కర్ మూలమని పేర్కొన్నారు. ఈ మహా శిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం మాత్రమే కాకుండా, చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటుస్ఫూర్తి ఇస్తుందని పేర్కొన్నారు. మన సమాజ గతిని, సమతా భావాల వైపు మరల్చటానికి,సంఘ సంస్కరణకు, పెత్తందారీ భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు, నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను అని తెలిపారు.