ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2 జారీ చేసి.. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తున్నామని, ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తున్నామని ఆదేశాలు జారీ చేయటం చాలా దారుణమైన విషయమని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కె. ఎస్ లక్ష్మణరావు ఐ.వెంకటేశ్వరరావు లు తెలిపారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక నిరంకుశమైన ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలపై ప్రయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. న్యాయమైన అంగన్వాడీ డిమాండ్లను పరిష్కరించకుండా ఈ విధమైన నిరంకుశ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండిస్తూన్నమని.. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం జరుగుతాయి అంగన్వాడీలకు సంబంధించి వేతనాలు గ్రాట్యుటీ పెంపుదల మొదలైన అంశాలపై యూనియన్లతో వెంటనే చర్చలు జరపాలని కోరారు.
సమ్మె విచ్ఛిన్న కుట్రలు ఫలించవు : ఐద్వా
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవల ను అత్యవసర సర్వీసులు గా పేర్కొంటు సమ్మెనిషేధిస్తూ జీవో జారీ చేయడాన్ని మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి,డి.రమాదేవి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.మహిళలు చేస్తున్న శ్రమను గుర్తించి పర్మినెంట్ చేయకుండా.. నిర్భంధం విధించడానికి పూనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. అంగన్వాడీల పై ఒత్తిడి తెచ్చి వారి జీతాలు పెంచకుండా సమ్మెను విచ్చిన్నం చేయాలన్న కుట్రలు ఫలించవని,త్వరలోనే వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.