కేంద్ర బిజెపి ప్రభుత్వం డ్రైవర్ల పై వేసిన “హిట్ అండ్ రన్ కేసులో” ఏడు లక్షల జరిమానా, పది సంవత్సరాల జైలు శిక్ష విధించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జయహో రథసారథి డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఏలేటి వాసు డిమాండ్ చేశారు. ఏలేటి ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద జయహో రథసారథి డ్రైవర్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు, బ్యానర్లతో తమ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా వాసు ఏలేటి మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మా డ్రైవర్స్ పై ఇలాంటి సెక్షన్లో పెట్టి వారి జీవితాలతో ఆటలాడకూడదని కోరారు. ఇప్పటికే డ్రైవర్స్ క్లీనర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని తిరిగి మూలిగే నక్క పై తాటికాయ పడినట్టు చందాగా కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమని వాపోయారు.కేంద్ర నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా డ్రైవర్స్ అందరూ నిరసన తెలియజేస్తారని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో జయహో రథసారథి రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు, కిషోర్, సింగరాజు,వైరంగ, మోజెస్,కొంగు శ్రీను, ఆలపాటి శ్రీను,పౌలు,లాజర్, జయ బాబు తదితరులు పాల్గొన్నారు.