రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికల సమ్మె రాజమండ్రిలో వేడి ఎక్కింది. శనివారము నుండి బయట వ్యక్తులను నియమించి పనిచేయించాలని వార్త రావడంతో ఆకస్మాతుగా మున్సిపల్ కార్మికులు శుక్రవారం పెద్దఎత్తున ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించారు . ఎంపీ వచ్చే వరకు బయట నినాదాలతో మారుమ్రోగింది. అనంతరం ఎంపీ తో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ… మున్సిపల్ కార్మికులకు పనిముట్లు కొనుగోలు చేయుటకు నిధులు లేవు, కోవిడ్, టాయిలెట్ వర్కర్లకు జీతాలు లేవు, కానీ ప్రత్యామ్నాయ పనులు చేయుటకు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రయత్నo చేస్తున్నారని విమర్శించారు.రోజువారీ కూలీ మగవారికి 600 రూపాయలు, ఆడవారికి 400 రూపాయలు మంజూరు చేయుటకు సిద్ధమయ్యారని, కార్మికులకు జీతాలు ఇవ్వలేని నగరపాలక సంస్థ ప్రత్యామ్నాయ పనులు చేయించడం సిగ్గుచేటని తెలిపారు. ప్రత్యామ్నాయ పనులు చేస్తే అడ్డగిస్తామని, కార్మికులకు ప్రత్యామ్నాయ వారికి మధ్య ఘర్షణలు ఏమైనా సంభవిస్తే దానికి పూర్తి గా నగరపాలక సంస్థ కమిషనర్ బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని 3 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నమ్మి గద్దెనెక్కించామని, బంపర్ మెజార్టీ అందించామని, మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, నమ్మకద్రోహం చేసిందని, ఇక మీ హామీలు నమ్మేది లేదని, 2024 ఎన్నికల లోపు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ పరిష్కారం చేయాలని… లేకుంటే మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల్లో ప్రచారం చేస్తామని, మా డిమాండ్స్ పరిష్కరించిన వారికే అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర మున్సిపల్ రంగం కార్మిక నాయకులను చర్చలకు పిలిచి సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలని మధు తెలిపారు.
ఎంపీ భారత్ మాట్లాడుతూ సమస్యను ముఖ్యమత్రి తో చర్చించి సమ్మె పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కుంద్రపు రాంబాబు , సీపీఐ నగర కార్యదర్శి కొండలరావు యూనియన్ ఏఐటీయూసీ నాయకులు రెడ్డి రమణ, ముత్యాలు మురళీకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, ధనుల దుర్గమ్మ, ముత్యాల నందకిషోర్, బంగారు గిరి, కాకి శారద, ఎం శివ, గోడం గిరి, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు