అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తన్నదని సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్ టియు కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.నరసింగరావు,జి.ఓబులేసు,కే. పొలారి విమర్శించారు. మంగళవారం విజయవాడ లోని భాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కి నిరసనగా ఈ నెల 9 న అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ ర్యాలీలు,సభలు,ఏర్పాటు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు తమ పోరాటానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ల సమ్మెను అణచడానికి జిల్లా అధికారులతో అనేక ప్రయత్నాలు చేయిస్తుందని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలుకొట్టడం చేసినప్పటికీ పిల్లలు ఎవరు కేంద్రాలకు వెళ్ళడం లేదని పేర్కొన్నారు.ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు గా మార్చే జీవో నేటికీ ఇవ్వలేదని తెలిపారు.నాలుగు సంవత్సరాల నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచకుండా మొండిగా వ్యవహరించడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ని చెల్లించాలని కోరారు.ఆలస్యం చేస్తే కార్మికులు లోంగిపోతారన్న తప్పుడు విధానాన్ని ప్రభుత్వం విడనాడి వారి న్యాయమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.