భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమని,భిన్నత్వంలో ఏకత్వం విశిష్టత కలిగిన దేశంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇరువురు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా “కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలు ప్రమాదంలో ప్రజాస్వామ్యం” అనే అంశంపై చర్చ గోష్టి జరిగింది. దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ముందుగా ఈ చర్చ గోష్టిని అక్కినేని వనజ ప్రారంభిస్తూ భారతదేశంలో విభిన్న భాషలు, మతాలు, జాతులు కులాలు, ఉప కులాలు, మూడువేల భాషలు ఉన్నాయని అటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పాలకులు ఖునీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి గొప్ప రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మనకు ఇచ్చారని, అటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తున్న పాలకులు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ ముసాయిదాను అంబేద్కర్ ప్రవేశ పెట్టినప్పుడే ఈ రాజ్యాంగం మంచివాడు చేతిలో పెడితే మంచిగా ఉంటుందని చెడ్డవాడి చేతిలో పెడితే మతాలు కులాల పేరుతో రాజ్యాంగాన్ని నాశనం చేస్తారని ఆయన చెప్పారని ఆమె గుర్తు చేశారు. పరిపాలనలోకి మతం వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని 1950లోనే అంబేద్కర్ చెప్పారని వివరించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారత రాజ్యాంగ ప్రతులను తగలబెట్టారని, భారత ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారని అటువంటి శక్తులు నేడు అధికారంలో ఉండడం దురదృష్టకరమన్నారు. మరొకసారి మోడీ అధికారంలోకి వస్తే నియంత్రత్వం, అరాచకం పేట్రేగిపోతుందని తెలిపారు.
హిట్లర్ పాలనను తలపిస్తున్న జగన్ సర్కార్
రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు లేవని హిట్లర్ రూపంలో జగన్ పరిపాలిస్తున్నాడని అన్నారు. ప్రశ్నించే వ్యక్తులను అణిచివేయడంలో ముఖ్యమంత్రి అగ్రభాగాన నిలబడ్డారని తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించే నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఉద్యమాలకు ఎల్లకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగే ఇతనికి నియంతృత్వ పోకడలు ఉన్నాయని తెలంగాణ ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పి కెసిఆర్ ను ఇంటికి పంపించారని, అదే పద్ధతిలో జగన్ కూడా ఇంటికి సాగనంపాలని ఆమె పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, న్యాయవాది కే జ్యోతి రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్,ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కే శ్రీనివాస్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, జట్లు సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్ల రామారావు, పేపర్ మిల్ నాయకులు జి ఏ రామారావు, రామకృష్ణ, ప్రజానాట్యమండలి నగర కార్యదర్శి సిడగం నౌరోజీ, మహిళా సమైక్య నాయకురాలు జిల్లా కన్వీనర్ ఎస్ దుర్గ, కో కన్వీనర్ ముత్యాలు, వ్యవసాయగా కార్మిక సంఘం నాయకులు టిలక్ష్మణ్, మల్లయ్య పేట నాయకులు టీ నాగేశ్వరరావు, దళితక్కుల పోరాట సమితి నాయకులు ఎం సాగర్, క్వారీ సెంటర్ నాయకులు ప్రకాష్, తదితరులు చర్చ గోష్టిలో పాల్గొన్నారు.